వైసీపీలో భగ్గుమన్న విభేదాలు
ABN , First Publish Date - 2021-10-28T06:00:32+05:30 IST
చేపల చెరువు విషయంపై వైసీపీ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు.

చేపల చెరువు వేలంపాటల్లో తలెత్తిన ఘర్షణ
ముగ్గురికి గాయాలు
పూతలపట్టు, అక్టోబరు 27: చేపల చెరువు విషయంపై వైసీపీ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. పూతలపట్టు మండలం పి.కొత్తకోట పంచాయతీ పరిధిలో ఉన్న పలు చెరువులకు స్థానిక సచివాలయంలో బుధవారం వేలం పాట నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రెడ్డి చెరువుకు సంబంధించిన వేలం పాట జరుగుతుండగా సర్పంచ్ భర్త అమరనాథరెడ్డి, వైసీపీ నాయకుడు రాజారత్నంరెడ్డి వర్గాల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. వీరి మధ్య కొన్నేళ్లుగా పార్టీపరంగా విభేదాలు ఉన్నాయి. కొట్టుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడంతో సచివాలయ సిబ్బంది ఒకరితో పాటు ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని పి.కొత్తకోట పీహెచ్సీకి తరలించారు.సీఐ ఆశీర్వాదం, ఎస్ఐ మనోహర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు.