రహరులకు కేంద్ర నిధులు
ABN , First Publish Date - 2021-12-15T05:30:00+05:30 IST
జిల్లాలోని జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించింది.

మదనపల్లె- ములకలచెరువు రోడ్డుకు రూ.480 కోట్లు
చిత్తూరు బైపాస్కు రూ.90 కోట్లు
పీలేరులో రెండు ఆర్వోబీలకు రూ.100 కోట్లు
చిత్తూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. తాజాగా మదనపల్లె- ములకలచెరువు మధ్య 43.59 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.480 కోట్లను మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ట్వీట్ చేశారు. ఇందులో 31.75 కిలోమీటర్లు రెండు వరుసలుగా, 11.84 కిలోమీటర్లు నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. తుమ్మలగుంట రైల్వేస్టేషన్ వద్ద టోల్ప్లాజా కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే చిత్తూరు బైపాస్ (మురకంబట్టు సర్కిల్ నుంచి చెర్లోపల్లె క్రాస్ వరకు) అభివృద్ధికి రూ.90 కోట్లు కేటాయించింది. పీలేరు నుంచి చిత్తూరు, మదనపల్లె మార్గాల్లో ఉన్న రెండు రైల్వే గేట్ల వద్ద ఆర్వోబీలను నిర్మించనున్నారు. వాటికోసం రూ.100 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులన్నింటికీ టెండర్లు పూర్తికాగా, భూసేకరణ చేయాల్సి ఉంది. ఆర్వోబీల నిర్మాణానికి భూసేకరణ పూర్తయినప్పటికీ పరిహారం చెల్లించాల్సి ఉంది.