ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-03-22T07:33:06+05:30 IST
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్ ఆదివారం ప్రారంభించారు.
![ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం](https://media.andhrajyothy.com/appimg/galleries/2021032202011389/03222021020130n60.jpg)
తిరుచానూరు, మార్చి 21: పోరాట పటిమను, జాతీయతా భావాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్ రాజారెడ్డి పిలుపునిచ్చారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్ను ఆదివారం ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. ఈ ఫొటోలను తిలకిస్తుంటే.. స్వాతంత్య్ర సంగ్రామం ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్లుగా ఉందన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, రాయలసీమ జిల్లాల ఏడీ శివహరినాయక్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం సిద్ధించి 2022 నాటికి 75ఏళ్లు పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు. అందులో భాగంగానే ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మూడ్రోజులపాటు నిర్వహించే ఈ ఉచిత ప్రదర్శనను నగరవాసులు, విద్యార్థులు తిలకించాలని కోరారు. అంతకుముందు జానపద కళాకారులు ఆలపించిన దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శిల్పారామం ఏవో ఖాదర్వల్లి తదితరులు పాల్గొన్నారు.