ఓ అపరిచిత వ్యక్తికి డబ్బులు తీయమని ఏటీఎం కార్డు ఇస్తే..
ABN , First Publish Date - 2021-01-23T16:07:09+05:30 IST
ఓ అపరిచిత వ్యక్తి దీన్ని గమనించి.. తాను తీసిస్తాననడంతో ఏటీఎం ఇచ్చి
చిత్తూరు: ఏటీఎం కార్డును మార్చేసి.. రూ.97,800 దోచేసిన సంఘటన రెండ్రోజుల కిందట చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మోహన్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. యాదమరి మండలం కీనాటంపల్లెకు చెందిన చంద్రశేఖర్(32) తన భార్య పేరిట వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తాన్ని విత్ డ్రా చేయించాడు. ఆ నగదు తన బ్యాంకు ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో కొంత మొత్తం తీసుకోవడానికి ఈనెల 20వ తేదీన నగరంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచి ఏటీఎం వద్దకొచ్చాడు. సర్వర్ మొరాయించడంతో ఏటీఎం నుంచి డబ్బులు రాలేదు. దాంతో పక్కనే ఉన్న ఓ అపరిచిత వ్యక్తి దీన్ని గమనించి.. తాను తీసిస్తాననడంతో ఏటీఎం ఇచ్చి, పిన్ నెంబరు చెప్పాడు. రెండు దఫాలుగా రూ.19వేలను తీసిచ్చాడు. ఆ తర్వాత ఆ అపరిచితుడు వేరే ఏటీఎం కార్డును ఇచ్చేసి, వెళ్లిపోయాడు. దీన్ని గమనించుకోకుండా చంద్రశేఖర్ ఇంటికొచ్చేశాడు. శుక్రవారం మళ్లీ ఏటీఎం వద్దకెళ్లినపుడు తన కార్డు మార్చేసిన విషయంతో పాటు బ్యాంకు ఖాతా నుంచి రూ.97,800 విత్ డ్రా అయినట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయమై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.