హత్య కేసులో నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2021-12-15T06:37:06+05:30 IST

నెల్లూరులో హత్య చేసి పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను శ్రీకాళహస్తి పోలీసులు అరెస్టు చేశారు.

హత్య కేసులో నిందితుల అరెస్టు
అరెస్టు చేసిన నిందితులతో పోలీసులు

శ్రీకాళహస్తి, డిసెంబరు 14: నెల్లూరులో హత్య చేసి పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను శ్రీకాళహస్తి పోలీసులు అరెస్టు చేశారు. వివరాలివీ... నెల్లూరుకు చెందిన జలీల్‌(23), హఫీజ్‌(19), రాహుల్‌(22)లు ఈనెల 9న ఇదే పట్టణం బజారువీధికి చెందిన షేక్‌ అల్తాఫ్‌ అనే యువకుడిని హత్య చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న బస్సులో ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా ప్రవర్తించడంపై తోటి ప్రయాణికులు 100కి ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన శ్రీకాళహస్తి హైవే మొబైల్‌ స్క్వాడ్‌ ఇన్‌చార్జి, హెడ్‌కానిస్టేబుల్‌ గోపాల్‌రాజు సిబ్బందితో కలసి పట్టణ శివారులోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. ప్రయాణికులు ఫిర్యాదు చేసిన బస్సు రాగానే, ముగ్గురినీ అదుపులోకి తీసుకుని టూటౌన్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నెల్లూరుకు చెందిన షేక్‌ అల్తాఫ్‌ను హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో శ్రీకాళహస్తి పోలీసులు ముగ్గురు నిందితులను మంగళవారం నెల్లూరుకు తరలించి వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు. నిందితుల అరెస్టులో కానిస్టేబుళ్లు గోపాల్‌రాజు, రామకృష్ణ, అన్నయ్య, చెక్‌పోస్టు సిబ్బంది వెంకటేష్‌ సహకరించారు. సమాచారం అందగానే సకాలంలో నిందితులను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందిని తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ప్రత్యేకంగా అభినందించారు. 

Updated Date - 2021-12-15T06:37:06+05:30 IST