నెల గడుస్తున్నా అందుబాటులోకి రాని అగ్రి టెస్టింగ్ ల్యాబ్
ABN , First Publish Date - 2021-08-07T05:37:22+05:30 IST
రైతులు తాము కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో నాలుగుచోట్ల అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు ప్రారంభించింది. జూలై 8వ తేదీ రైతు దినోత్సవం సందర్భంగా ఆర్భాటంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రిబ్బన్లు కత్తిరించి ల్యాబ్లను ప్రారంభించారు. అయితే నెల గడుస్తున్నా ల్యాబ్లలో మాత్రం ఇంకా సేవలు ప్రారంభించలేదు.
చిత్తూరు జిల్లాలో నాలుగు చోట్ల ల ఏర్పాటు
మదనపల్లె టౌన్, ఆగస్టు 6: రైతులు తాము కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో నాలుగుచోట్ల అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు ప్రారంభించింది. జూలై 8వ తేదీ రైతు దినోత్సవం సందర్భంగా ఆర్భాటంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రిబ్బన్లు కత్తిరించి ల్యాబ్లను ప్రారంభించారు. అయితే నెల గడుస్తున్నా ల్యాబ్లలో మాత్రం ఇంకా సేవలు ప్రారంభించలేదు. ఇంకా ల్యాబ్లకు టెస్టింగ్ పరికరాలు సరఫరా కావాల్సి ఉంది. కొన్ని ల్యాబ్లకు విద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వలేదు.
రైతులు ఎరువులు, విత్తనాల నాణ్యత పరిక్షించుకోవడం కోసం తాడేపల్లె, బాపట్లలోని అగ్రి టెస్టింగ్ ల్యాబ్లకు వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రైతులు తాము కొనుగోలు చేసే విత్తనాలు, ఎరువుల నాణ్యతను ఈ ల్యాబ్లలో పరీక్షించుకోవచ్చు. ల్యాబ్ల నిర్మాణానికి నాబార్డు, ఆర్కేవీవై నిధులతో ఒక్కో నియోజకవర్గానికి రూ.65.90లక్షల చొప్పున మంజూరు చేసింది. వీటిలో టెస్టింగ్ పరికరాలు, ఫర్నిచర్, కంప్యూటర్లను ప్రభుత్వమే సరఫరా చేయాల్సి ఉంది. కాగా జిల్లాలో మదనపల్లె, ములకలచెరువు, నగరి, శ్రీకాళహస్తిలో మాత్రమే అగ్రి టెస్టింగ్ ల్యాబ్ భవనాలు సిద్ధమయ్యాయి. దీంతో ఈ నాలుగు చోట్ల రైతు దినోత్సవం సందర్భంగా వర్చువల్ విధానంలో సీఎం జగన్ ల్యాబ్లను ప్రారంభించారు.
సరఫరా కాని టెస్టింగ్ పరికరాలు
జిల్లాలో నాలుగు చోట్ల ప్రారంభించిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్లకు పూర్తిస్థాయిలో టెస్టింగ్ పరికరాలు సరఫరా కాలేదు. ల్యాబ్ల వద్దకు వచ్చే రైతుల అవసరార్థం తాగునీరు, మరుగుదొడ్లకు నీటి సౌకర్యం ఇంకా కల్పించలేదు. కేవలం ఖాళీ భవనాలు మాత్రమే సిద్ధం చేశారు. ఈ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లలో పనిచేసేందుకు అగ్రికల్చర్ అధికారి(ఏవో), ఇద్దరు అగ్రికల్చర్ విస్తరణ అధికారుల(ఏఈవో)ను నియమించాలి. కానీ జిల్లాలో ఎక్కడా కొత్త నియామకాలు జరగలేదు. కేవలం అందుబాటులో ఉన్న ఆయా మండలాల ఏవో, ఏఈవోలు అగ్రి టెస్టింగ్ ల్యాబ్లలో పనిచేయాల్సి ఉంది. వీరికి ఇది వరకే వారం రోజుల పాటు విత్తనాలు, ఎరువుల పరీక్షలపై శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే సాగుబడి, ఆర్బీకేల నిర్వహణ, క్షేత్రస్థాయిలో విధులతో బిజీగా ఉండే ఏవో, ఏఈవోలకు పనిభారం పెరగనుంది. జిల్లాలో జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగా పడమటి మండలాల్లో వేరుశనగ, తూర్పున వరి సాగు ప్రారంభమైంది. అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు సిద్ధంగా వుంటే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ల్యాబ్లు ప్రారంభమై నెల రోజులవుతున్నా ఇంకా ఎక్కడా సేవలు అందుబాటులోకి రాకపోవడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
15లోగా ల్యాబ్లను అందుబాటులోకి తెస్తాం
మదనపల్లె, ములకలచెరువులో ఏర్పాటు చేసిన అగ్రిటెస్టింగ్ ల్యాబ్లను ఆగస్టు 15వ తేదీలోగా అందుబాటులోకి తీసుకొస్తాం. 70శాతం పరికరాలు వచ్చాయి, మిగిలినవి వచ్చాక అన్నింటిని అందుబాటులోకి తెస్తాం. రెండు చోట్ల ఏవో, ఏఈవోలను నియమిస్తాం. 15వ తేదీనాటికి రైతులు విత్తనాలు, ఎరువులు పరీక్షించుకోవచ్చు.
-కె.శివశంకర్, ఏడీఏ, వ్యవసాయశాఖ, మదనపల్లె