శ్రీకాళహస్తికి అదనపు జిల్లా కోర్టు మంజూరు

ABN , First Publish Date - 2021-08-27T06:35:33+05:30 IST

శ్రీకాళహస్తికి అదనపు జిల్లా కోర్టు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాళహస్తి న్యాయస్థాన సముదాయ పరిధిలో జిల్లాస్థాయి కేసుల పరిష్కారానికి గతంలో అవకాశం ఉండేదికాదు. ఇక్కడి ఫిర్యాదుదారులు తిరుపతి, చిత్తూరులోని న్యాయస్థానాలను ఆశ్రయించేవారు. ఒక ప్రాంతం నుంచి 500 పైబడి జిల్లాస్థాయి కేసులు మరో ప్రాంతంలోని న్యాయస్థానంలో నమోదయ్యే పరిస్థితులు ఉన్న సందర్భంలో అక్కడే అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి.

శ్రీకాళహస్తికి అదనపు జిల్లా కోర్టు మంజూరు

శ్రీకాళహస్తి అర్బన్‌, ఆగస్టు 26: శ్రీకాళహస్తికి అదనపు జిల్లా కోర్టు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాళహస్తి న్యాయస్థాన సముదాయ పరిధిలో జిల్లాస్థాయి కేసుల పరిష్కారానికి గతంలో అవకాశం ఉండేదికాదు. ఇక్కడి ఫిర్యాదుదారులు తిరుపతి, చిత్తూరులోని న్యాయస్థానాలను ఆశ్రయించేవారు. ఒక ప్రాంతం నుంచి 500 పైబడి జిల్లాస్థాయి కేసులు మరో ప్రాంతంలోని న్యాయస్థానంలో నమోదయ్యే పరిస్థితులు ఉన్న సందర్భంలో అక్కడే అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. శ్రీకాళహస్తి పరిధి నుంచి సుమారు 621 కేసులు చిత్తూరు, తిరుపతి జిల్లా న్యాయస్థానాల్లో నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏడేళ్ల క్రితం స్థానిక న్యాయవాదులు శ్రీకాళహస్తిలో అదనపు జిల్లా న్యాయస్థానం అవసరమని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. 2015 సెప్టెంబరు 9వ తేదీన శ్రీకాళహస్తిలో అదనపు జిల్లా న్యాయస్థానం ఏర్పాటు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో హైదరాబాదులో ఉన్న హైకోర్టు ద్వారా శ్రీకాళహస్తికి అదనపు జిల్లా న్యాయస్థానం మంజూరైంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు మాత్రం జారీ కాలేదు. దీంతో 2017లో శ్రీకాళహస్తి పట్టణానికి చెందని న్యాయవాది ఎం.ప్రసాదనాయుడు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. అనంతరం గుంటూరులో ఏపీ నూతన హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. న్యాయవాది ప్రసాదనాయుడు ప్రజాప్రయోజన వాజ్యంపై గుంటూరుకు చెందిన చంద్రయ్య నాయుడును తన తరపున న్యాయవాదిగా ఏర్పాటు చేసుకుని రెండేళ్లనుంచి తిరిగి పోరాటం చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనురూబ్‌ గోస్వామి పిల్‌ను పరిశీలించి శ్రీకాళహస్తికి జిల్లా న్యాయస్థానాన్ని వెంటనే మంజూరు చేయాల్సిందిగా తిరిగి ఆదేశాలు జారీ చేశారు. దీంతో శ్రీకాళహస్తికి అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టును మంజూరు చేస్తూ గురువారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనివల్ల శ్రీకాళహస్తితో పాటు సత్యవేడు, నాగలాపురం, కేవీబీపురం, వరదయ్యపాళెం, బుచ్చినాయుడుకండ్రిగ ప్రాంతాల జిల్లాస్థాయి కేసులను శ్రీకాళహస్తిలో దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. 

Updated Date - 2021-08-27T06:35:33+05:30 IST