కొవిడ్ బాధితుల కోసం రుయాలో 876 బెడ్లు
ABN , First Publish Date - 2021-04-21T06:38:42+05:30 IST
కొవిడ్ బాధితుల కోసం తిరుపతిలోని రుయాస్పత్రిలో 876 బెడ్లు సిద్ధం చేసినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ భారతి తెలిపారు.
సీరియస్ అయ్యాక వచ్చేవారే మరణిస్తున్నారు
సూపరింటెండెంట్ డాక్టర్ భారతి
తిరుపతి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ బాధితుల కోసం తిరుపతిలోని రుయాస్పత్రిలో 876 బెడ్లు సిద్ధం చేసినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ భారతి తెలిపారు. మంగళవారం ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ‘ఆస్పత్రిలోని 876 బెడ్లలో.. 441 ఆక్సిజన్, 135 వెంటిలేటర్ ఐసీయూ, 200 నాన్ ఆక్సిజన్వి ఉన్నాయి. అడ్మిట్ అయిన వారికి గతంలోలాగే ఆహారం అందిస్తున్నాం. 30 బెడ్లను ఓ యూనిట్గా తీసుకున్నాం. మొత్తం 25యూనిట్లుండగా, ప్రతిచోటా వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని నియమించాం. కొవిడ్ హెల్ప్ డెస్క్, అడ్మిషన్ కౌంటర్ వేర్వేరుగా ఉంటాయి. హెల్ప్ డెస్క్లో కొవిడ్ టెస్టు నుంచి అడ్మిషన్ వరకు సూచనలు, సలహాలు ఇస్తారు. బాధితులు ఆస్పత్రికి రాగానే ఎక్స్రేతో పాటు రక్తంద్వారా ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. వీటి ఫలితాలను అనుసరించే అడ్మిషన్పై నిర్ణయం ఉంటుంది. ఫంక్షన్ల వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువైనట్లు వచ్చే అడ్మిషన్లను బట్టి గుర్తించాం. సీరియస్ అయ్యాక ఎక్కువగా రుయాకు వస్తున్నారని, దీనివల్లే ఈనెలలోనే 35 మంది మరణించారు. వైరస్ లక్షణాలు బయటపడగానే కొవిడ్ కేర్ సెంటర్కు వెళ్లాలి. అందరూ మాస్కులు ధరించటం, శానిటైజర్లు వాడటం తప్పనిసరి’ అని భారతి పేర్కొన్నారు.