సీఆర్పీల జీతాలు నిలిపేస్తాం..!
ABN , First Publish Date - 2021-10-23T05:33:10+05:30 IST
జగనన్న విద్యాకానుక (జేవీకే) కిట్ల బయోమెట్రిక్ అథెంటికేషన్ శనివారం సాయంత్రంలోగా పూర్తి చేయకుంటే సీఆర్పీలకు వేతనాలు నిలిపేస్తామని సమగ్రశిక్ష ఏపీసీ తిలక్ విద్యాసాగర్ హెచ్చరించారు.
నేటి సాయంత్రంలోగా జేవీకే కిట్ల బయోమెట్రిక్ పూర్తి చేయాల్సిందే
టెలీకాన్ఫరెన్స్లో ఏపీసీ తిలక్ విద్యాసాగర్
అనంతపురం విద్య, అక్టోబరు 22: జగనన్న విద్యాకానుక (జేవీకే) కిట్ల బయోమెట్రిక్ అథెంటికేషన్ శనివారం సాయంత్రంలోగా పూర్తి చేయకుంటే సీఆర్పీలకు వేతనాలు నిలిపేస్తామని సమగ్రశిక్ష ఏపీసీ తిలక్ విద్యాసాగర్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన సమగ్రశిక్ష నుంచి ఎంఈఓలు, సీఆర్పీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న విద్యాకానుక కిట్లు బయోమెట్రిక్ అథెంటికేషన్ చాలా పెండింగ్లో ఉందన్నారు. ఏ స్కూల్లో నూ కిట్ల మెటీరియల్ కనిపించకూడదన్నారు. స్కూళ్ల నుంచి ఎమ్మార్సీకి, అక్కడి నుంచి సమగ్రశిక్షకు అప్పగించాలన్నారు. సీఆర్పీ వినయ్, సావిత్ర, గాయత్రి, శ్రీనివాసులు, సావిత్రమ్మ, లక్ష్మి తదితరులు పేరుపేరునా ఆయన హెచ్చరించారు. శనివారం సాయంత్రంలోగా పూర్తి చేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసే సీఆర్పీలకు ఈ నెల జీతాలు పెట్టవద్దంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. నాడు-నేడు 680 స్కూళ్లకు సంబంధించి అదనపు తరగతి గదుల వివరాలు పంపాలనీ, 670 స్కూళ్ల మిగులు డబ్బు వివరాలను వెంటనే అందజేయాలని ఆదేశించారు.