వృథాగా మారిన స్విమ్మింగ్ పూల్
ABN , First Publish Date - 2021-05-15T06:02:25+05:30 IST
అక్కరలేకపోయినా నిధులు ఉన్నాయి కదా అని స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్లో రూ. 60 లక్షలతో వెచ్చించి నిర్మించిన స్విమ్మింగ్ పూల్ నిరర్థకంగా మారింది.
అవసరం లేకపోయినా నిర్మించిన రైల్వే అధికారులు
బూడిదలో పోసిన పన్నీరైన నిధులు
గుంతకల్లు, మే 14: అక్కరలేకపోయినా నిధులు ఉన్నాయి కదా అని స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్లో రూ. 60 లక్షలతో వెచ్చించి నిర్మించిన స్విమ్మింగ్ పూల్ నిరర్థకంగా మారింది. ఒకటిన్నర సంవత్సరం కిందట స్థానిక రైల్వే క్లబ్కు స్విమ్మింగ్ పూల్ కోసం నిధులు మంజూరయ్యాయి. అక్కడ ఇదివరకూ స్విమ్మింగ్ పూల్ ఉండటంతో రైల్వే అధికారులు ఆ నిర్మాణాన్ని అవసరం లేకపోయినా రైల్వే ఇన్స్టిట్యూట్లో నిర్మించడానికి నిర్ణయించారు. దాదాపు రూ. 10 లక్షలతో స్విమ్మింగ్ పూల్ను ఆగమేఘాలపై నిర్మించి, రెండు డ్రెస్సింగ్ రూములను, హాల్ను కట్టారు. మొత్తం రూ. 60 లక్షలలో భారీ స్థాయిలో నిర్మించగా.. అప్పటి డీఆర్ఎం విజయ్ ప్రతాప్ సింగ్ ప్రారంభించారు. కాగా ఆయన బదిలీపై వెళ్తున్నారన్న కారణంగా ఈ స్విమ్మింగ్ పూల్ను అత్యంత వేగవంతంగా నిర్మించారు. సరిగా క్యూరింగ్ కాకుండా నిర్మాణం చేపట్టినందున అది త్వరగా దెబ్బతింటుందని భావించారు. అనుకున్న విధంగానే ఈ స్విమ్మింగ్ పూల్లో నీటిని నింపితే లీక్ అవుతుండటంతో దాన్ని వినియోగించడంలేదు. స్విమ్మింగ్ పూల్ లీకేజీని అరికట్టి వినియోగంలోకి తేవడానికి కాంట్రాక్టరు పనులు చేపట్టి పూర్తిచేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తికానందున ఇంకా రైల్వే ఇన్స్టిట్యూట్కు ఈ నిర్మాణాన్ని అధికారికంగా అప్పగించలేదు. ఒకటిన్నర సంవత్సరం గడచిపోయినా దీన్ని పూర్తిచేసే విషయంగా అధికారులు ఆసక్తిచూపడంలేదు. అవసరం లేకపోయినా నిర్మించిన ఈ కట్టడం వల్ల దాదాపు అర ఎకరా స్థలం వృథా అయ్యిందని రైల్వే ఇన్స్టిట్యూట్ వర్గాలే అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. అంత డ బ్బుతో ఇక్కడ గదులను నిర్మించి ఉంటే వి వాహాది కార్యక్రమాల కు రైల్వే ఇన్స్టిట్యూట్ను బుక్చేసుకునే రైల్వే ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.