హాస్టళ్లలో ఆకలి కేకలు..!

ABN , First Publish Date - 2021-12-15T07:12:22+05:30 IST

వసతిగృహాల్లో ఆకలికేకలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వసతిగృహాల్లోని పేద విద్యార్థులు సరైన ఆహారం అందక ఇబ్బంది పడుతున్నారు.

హాస్టళ్లలో ఆకలి కేకలు..!
హాస్టల్‌లో భోజనం చేస్తున్న విద్యార్థినులు

పేద విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్యం

అందని మెస్‌ చార్జీలు

ఆగస్టు నుంచి ఒక్కపైసా విదల్చనివైనం

లబోదిబోమంటున్న వార్డెన్లు

చికెన, గుడ్డు, పండ్లలో కోత

విద్యార్థులకందని కాస్మెటిక్‌ చార్జీలు

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 14: వసతిగృహాల్లో ఆకలికేకలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వసతిగృహాల్లోని పేద విద్యార్థులు సరైన ఆహారం అందక ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు ఆగస్టు నెల నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవటమే కారణమని సమాచారం. ఐదు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో వసతిగృహాల నిర్వహణ భారంగా మారింది. కాస్మెటిక్‌ చార్జీలు సైతం చెల్లించకపోవటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు లేకపోవడం, బిల్లులు పెండింగ్‌ ఉండడంతో సంక్షేమ శాఖల అధికారులు తలలు బాదుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులకు సంబంధించి ప్రీమెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌ మొత్తం కలుపుకుని 225 వరకు వసతిగృహాలున్నాయి. ఇందులో సుమారు 26 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. నెలకు రూ.2 కోట్ల వరకు నిర్వహణ వ్యయం వస్తోంది. గత ఆగస్టు నుంచి ఐదు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో వార్డెన్లు లబోదిబోమంటున్నారు. నెల, రెండు నెలలైతే అప్పు చేసి, సరుకులు తెచ్చి వండిపెట్టొచ్చు కానీ.. ఐదు నెలలుగా బిల్లులు చెల్లించకపోతే ఎలా నిర్వహించేదని వార్డెన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎఫ్‌ఎంఎస్‌ అమలుతోనే జాప్యం అవుతోందని ఉన్నతాధికారులు చెబుతున్నారని వాపోతున్నారు. కాంట్రాక్టర్లు సైతం హాస్టళ్లకు సరుకుల సరఫరా నిలిపివేశారు. పెంచిన మెస్‌ చార్జీల ప్రకారం మెనూ అమలు కష్టసాధ్యంగా మారుతోంది. మూడు రోజులు చికెన, పౌష్టికాహారం అందించటం ఖర్చుతో కూడుకున్న పనిగా భావిస్తున్నారు.


ఆగిన కాస్మెటిక్‌ చార్జీలు 

విద్యార్థులకు హెయిర్‌ కటింగ్‌, సబ్బులు, బ్రష్‌, పేస్ట్‌, జుట్టుకు నూనె వంటి వాటిని కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రతినెలా కాస్మెటిక్‌ చార్జీలు చెల్లిస్తుంది. 8, 9, 10వ తరగతి చుదువుతున్న వారికి నెలకు రూ.160, మడు నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు రూ.125 చెల్లిస్తున్నారు. ఐదు నెలలుగా ఈ కాస్మెటిక్‌ చార్జీలు కూడా ఇవ్వట్లేదు. సుమారు 16వేల మంది ప్రీమెట్రిక్‌ హాస్టల్‌ విద్యార్థులకు ఐదు నెలలకుగాను రూ.1.1 కోట్ల వరకు కాస్మెటిక్‌ చార్జీలు పెండింగ్‌లో ఉన్నాయి.


చికెనలో కోత

సంక్షేమ వసతిగృహాలు, గురుకుల పాఠశాలల విద్యా ర్థులకు ప్రస్తుత మెనూ ప్రకారం మూడు రోజులు చికెన పెట్టాలి. మెస్‌ చార్జీల బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో వారానికి ఒకరోజు ఆదివారం మాత్రమే వడ్డిస్తున్నారు. బిల్లులు పెం డింగ్‌ ఉండటంతో నిర్వహణ కష్టసాధ్యమని చెబుతున్నారు. వారానికి ఆరురోజులు గుడ్డు ఇవ్వాల్సి ఉన్నా.. రెండు, మూడు రోజులు మాత్రమే అందిస్తున్నారు. ఇక పండు రోజుకు రెండు పూటలా ఇవ్వాలి. ఒక పూట మాత్రమే ఇస్తున్నారు.


మెస్‌ చార్జీల వివరాలివీ..

ప్రీమెట్రిక్‌ హాస్టళ్లలో 3, 4వ రతగతి వరకు ప్రస్తుతం రూ.1000గా చెల్లిస్తున్నారు. 5, 6, 7వతరగతి విద్యార్థులకు నెలకు రూ.1250గా,  8, 9, 10వతరగతి విద్యార్థులకు రూ.1250గా చెల్లిస్తున్నారు. కళాశాల వసతిగృహ విద్యా ర్థులకు ప్రస్తుతం రూ.1400గా  ఇస్తున్నారు. మెస్‌ చార్జీలు బిల్లుల పెండింగ్‌తో ఆహారపదార్థంలో పరిమాణం పెంచే అవకాశం లేదు. మూడు రోజుల చికెన పెట్టేందుకు వార్డెనులు భయపడుతున్నారు.


మెస్‌ చార్జీలు పెంచాలి..పెండింగ్‌  బిల్లులు చెల్లించాలి 

మెస్‌ చార్జీలు పెంచాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌, ఉన్నతాధికారులకు పలు మార్లు వినతిపత్రం అందజేశాం. ప్రస్తుత నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నం టుతున్నాయి. ఈ ధరలతో ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం హాస్టల్‌ విద్యార్థులకు ఆహారం అందించడానికి సాధ్యం కావడం లేదు. ప్రస్తుత నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని మెస్‌ చార్జీలు పెంచాలని కోరాం. పెండింగ్‌లో ఉన్న మెస్‌ చార్జీలు కూడా త్వరగా చెల్లించాలని విన్నవించాం. అప్పులు తీసుకువచ్చి పిల్లలకు అన్నం పెట్టడం కష్టమవుతోంది. 

-  మారుతీప్రసాద్‌, రాజశేఖర్‌నాయుడు 

బీసీ వార్డెన్లసంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు



త్వరలో చెల్లిస్తాం

హాస్టళ్ల నిర్వహణకు, విద్యార్థులకు కాస్మెటిక్‌ చార్జీలు త్వరలో చెల్లించే అవకాశం ఉంది. ప్రధానంగా సీఎ్‌ఫఎం ఎస్‌ చెల్లింపు అమలుతోనే ఆలస్యమవుతోంది. అయితే త్వ రలో అంతా క్లియర్‌ అవుతుంది. వార్డెన్లు ఎవరూ ఆందో ళన చెందాల్సిన పనిలేదు. పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టడమే మన విధి. విద్యార్థులకు ప్రస్తుతముండే ఽనిత్యా వసర వస్తువుల ధరల ప్రకారం పౌష్టికాహారం అందించా లంటే మెస్‌ చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని ఇప్ప టికే వార్డెన్ల ద్వారా ఉన్నతాధికారులకు ప్రతిపాదించాం.

- యుగంధర్‌, బీసీ సంక్షేమశాఖ డీడీ, విశ్వమోహనరెడ్డి సాంఘికసంక్షేమశాఖ డీడీ, అన్నాదొర జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి

Updated Date - 2021-12-15T07:12:22+05:30 IST