జగన్నాథానికే పూర్తి బాధ్యతలు
ABN , First Publish Date - 2021-07-28T06:51:59+05:30 IST
జిల్లా సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ (ఎఫ్ఏసీ) బాధ్యతలను పూర్తిస్థాయిలో డాక్టర్ జగన్నాధానికే అప్పగించారు.
ఆస్పత్రికి చేరిన డీఎంఈ ఉత్తర్వులు
అనంతపురం వైద్యం, జూలై 27: జిల్లా సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ (ఎఫ్ఏసీ) బాధ్యతలను పూర్తిస్థాయిలో డాక్టర్ జగన్నాధానికే అప్పగించారు. ఇక్కడ గతంలో ఎఫ్ఏసీగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావును నెల్లూరుకు బదిలీ చేశారు. ఆ తర్వాత డాక్టర్ ఆత్మారాంకు ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వగా, 20 రోజులు కొనసాగి తప్పుకున్నారు. అనంతరం మరో ఆర్థో సీనియ ర్ డాక్టర్, గతంలో ఇన్చార్జ్గా పనిచేసిన డాక్టర్ జగన్నాథానికి కలెక్టర్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఇక్కడికి పదోన్నతిపై డాక్టర్ సత్యవరప్రసాద్ను రెగ్యులర్ సూపరింటెండెంట్గా నియమించారు. ఆయన ఇక్కడికి రావడానికి అయిష్టత చూపుతున్నట్లు సమాచారం ఉందని.. అదే జరిగితే ఇన్చార్జ్ సూపరింటెండెంటే ఆస్పత్రికి దిక్కు అని ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. ఇప్పుడు అదే జరిగింది. సూపరింటెండెంట్గా పూ ర్తి అదనపు బాధ్యతలను జగన్నాథానికి అప్పగించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర శాఖ డీఎంఈ నుంచి అధికారిక ఉత్తర్వులు జిల్లా ఆస్పత్రికి చేరాయి. ఇక నుంచి ఆయన పూర్తి బాధ్యతలు కొనసాగించనున్నారు. ఎఫ్ఏసీ ఉత్తర్వులు రావడంతో పలువురు వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది డాక్టర్ జగన్నాథాన్ని కలిసి అభినందనలు తెలియజేశారు.