‘ఇంటింటికీ రేషన్‌ పంపిణీ’కి ఏర్పాట్లు పూర్తి చేయండి

ABN , First Publish Date - 2021-01-20T06:37:19+05:30 IST

ఇంటింటికీ రేషన్‌ పంపి ణీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు.

‘ఇంటింటికీ రేషన్‌ పంపిణీ’కి ఏర్పాట్లు పూర్తి చేయండి

జిల్లాకు 754 మినీట్రక్కు వాహనాలు

నేటి సాయంత్రంలోగా రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌ పూర్తవ్వాలి

అధికారులకు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశం


అనంతపురం, జనవరి19(ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ రేషన్‌ పంపి ణీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు. రేషన్‌ పంపిణీకి ప్రత్యేకంగా జిల్లాకు వచ్చిన 754 మినీట్రక్కులకు బుధవారం సాయంత్రంలోగా రిజిస్ర్టేషన్‌, ఇన్సూరెన్స్‌ చేయించాలని సూచించారు. ఆయన మంగళవారం కలెక్టరేట్‌ నుంచి ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్‌ ని ర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అందుకోసం జిల్లాకు కేటాయించిన 754 మినీ ట్రక్కులను ఈనెల 21వ తేదీన ప్రారంభించేందుకు సిద్ధం చేయాలన్నారు. ఆరోజు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగ న్మోహన్‌రెడ్డి విజయవాడలో మినీ ట్రక్కులను ప్రారంభిస్తారన్నారు. జిల్లాలో అదేరోజు ప్రారంభిస్తామన్నారు. 

     జిల్లాలో మొత్తం 11,76,522 రేషన్‌కార్డుదారులున్నారన్నారు. ఒక మినీ ట్రక్కు రోజుకు దాదాపు 90 మందికి సరుకులు సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. 15 నుంచి 20 రోజుల్లోగా ప్రతిఒక్కరి ఇంటికెళ్లి రేషన్‌ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాకు కేటాయించిన 754 మినీ ట్రక్కులకు ఆపరేటర్లను, ఒక్కో మినీ ట్రక్కుకు ఒక వీఆర్వోను నోడల్‌ అధికారిగా నియమించామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీలు నిశాంత్‌కుమార్‌, డాక్టర్‌ సిరి, డీఎ్‌సఓ రఘురామిరెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి అన్నాదొర, బీసీ కార్పొరేషన్‌ ఈడీ యుగంధర్‌, డీఎస్పీలు ప్రసాద్‌రెడ్డి, రాఘవరెడ్డి పాల్గొన్నారు.


ఏర్పాట్ల పరిశీలన

అనంతపురంరూరల్‌: ఇంటింటికీ రేషన్‌ పంపిణీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్‌ గంధం చంద్రుడు మంగళవారం సాయంత్రం స్థానిక తపోవనం బైపాస్‌ సర్కిల్‌లో జేసీ నిశాంత్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈనెల 21న తపోవనం నుంచి రుద్రంపేట బైపాస్‌ వరకు ట్రాఫిక్‌ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాఘవరెడ్డి, ఆర్డీఓ గుణభూషణ్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, ట్రాఫిక్‌ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, ఆర్‌ అండ్‌బీ ఎస్‌ఈ నాగరాజు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంకటరమణ పాల్గొన్నారు.


సిద్ధం చేస్తున్నాం

జిల్లాలో ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో భాగంగా మినీట్రక్కుల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌.. పౌరసరఫరాల కమిషనర్‌ కోన శశిధర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్‌ విజయవాడ నుంచి జాయింట్‌ కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జేసీకి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. మినీట్రక్కుల ప్రారంభోత్సవ పర్యవేక్షణకు డిప్యూటీ కలెక్టర్‌ను నియమించామని జేసీ తెలిపారు. డ్రోన్‌ కెమెరాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామనీ, ఎల్‌ఈడీ స్ర్కీన్‌ సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎ్‌సఓ రఘురామిరెడ్డి, సమాచార శాఖ డీఈఈ నాగభూషణం, ఎన్‌ఐసీ అధికారి రవిశంకర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-01-20T06:37:19+05:30 IST