పనిచేయలేకపోతే వెళ్లిపోండి
ABN , First Publish Date - 2021-08-06T06:36:07+05:30 IST
విద్యుత్ బకాయిల వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని, పనిచేయలేకపోతే వెళ్లిపోవాలని వి ద్యుత్ శాఖ అధికారులపై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత్ అధికారులపై సీఎండీ ఆగ్రహం
అనంతపురం రూరల్, ఆగస్టు 5: విద్యుత్ బకాయిల వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని, పనిచేయలేకపోతే వెళ్లిపోవాలని వి ద్యుత్ శాఖ అధికారులపై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన స్థానిక విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయంలోని మీటింగ్ హాల్లో జిల్లాలోని ఈఈలు, డీఈఈలు, ఏఈఈలు, ఏఏఓలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డివిజన్ల వారిగా విద్యుత్ బకాయిలు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులపై సమీక్షించారు. ఈక్రమంలో పలువురు విద్యుత్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎంత బకాయిలున్నాయి, ఎంత వసూలు చేశారు మీకే తెలియకపోతే.. మీరేం పనిచేసినట్లు అంటూ మండిపడ్డారు. అ లాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ బకాయిల వసూళ్లలో నిర్లక్ష్యం తగదన్నారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. జగనన్న లేఅవుట్లలో విద్యుత్పరమైన పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం బుక్కరాయసముద్రం పరిధిలోని సబ్స్టేషన్ను తనిఖీ చేశారు. అంతకు ముందు ఆయన ప్రధాన కార్యాలయంలోని స్టోర్స్ను పరిశీలించి, రైతులు, ఉద్యోగ సంఘాల నాయకులతో వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో ఎస్ఈ పీనాగరాజు, ఎస్ఎఏ మధుకుమార్, ఈఈలు రాజశేఖర్, సురేంద్ర, ముధుసూదన్, సుధాకర్, మునిశంకరయ్య, భూపతి, డీఈఈలు కల్యాణచక్రవర్తి పాల్గొన్నారు.
విద్యుత్ శాఖలో బదిలీలకు ఉత్తర్వులు
అనంతపురం రూరల్, ఆగస్టు 5: విద్యుత్ శాఖలో బదిలీలకు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత మూడేళ్లు ఒకేచోట పనిచేస్తున్న లైన్మన్, సీనియర్ అసిస్టెంట్లకు బదిలీలు చేపట్టాలని పేర్కొన్నారు. స్పౌజ్ కేటగిరి, దివ్యాంగులకు మినహాయింపు ఇస్తూ, బదిలీల ప్రక్రియ ఈనెల 12లోపు పూర్తి చేయాలని సూచించారు.