కొలువుదీరిన కుళ్లాయిస్వామి పీర్లు
ABN , First Publish Date - 2021-08-14T06:23:10+05:30 IST
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన మండలంలో ని గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పీర్లను శుక్రవారం మకానంలో కొలువుదీర్చారు.
నార్పల, ఆగస్టు13: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన మండలంలో ని గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పీర్లను శుక్రవారం మకానంలో కొలువుదీర్చారు. తెల్లవారుజామునే కుళ్లాయిస్వామి పీరును బంగారు, వెండి ఆ భరణాలు, పలు రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆలయంలో కూడా పూజారులతో మాత్రమే పూజలు గావించారు. గ్రామానికి చెందిన సురేష్ కరోనా నుంచి కోలుకోవడం, అతడి కుమారుడికి నీట్లో మంచి ర్యాంకు రావడంతో కుళ్లాయిస్వామి పీరుకు నాలుగున్నర తులాల బంగారు హారం ఇచ్చారు. కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల్లో చుట్టుపక్కల ఉన్న భక్తాదులు కొవిడ్ నిబంధనలు పాటించకుండా స్వామి దర్శనాలకు వస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కుళ్లాయిస్వామికి నిత్యపూజ నివేదన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్రెడ్డి తెలిపారు.