అనంతకు మరో స్కోచ్‌ అవార్డు

ABN , First Publish Date - 2021-03-21T06:28:55+05:30 IST

స్కోచ్‌ అవార్డు దక్కించుకుని జిల్లా మరోసారి సత్తా చాటింది.

అనంతకు మరో స్కోచ్‌ అవార్డు
జిల్లాకు దక్కిన స్కోచ్‌ అవార్డు

ఆ రెండు శాఖలకు సిల్వర్‌ మెడల్‌,  రెండు ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌లు

అనంతపురం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): స్కోచ్‌ అవార్డు దక్కించుకుని జిల్లా మరోసారి సత్తా చాటింది. 72వ స్కోచ్‌ అవార్డుల్లో జిల్లా సిల్వర్‌ మెడల్‌ సాధించటంతోపాటు పలు ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌లు సొంతం చేసుకుంది. ఈ మేరకు శనివారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన ఫైనల్‌ పోటీల్లో స్కోచ్‌ గ్రూప్‌ జిల్లాకు అవార్డును ప్రకటించింది. జిల్లాకు మరో అవార్డు దక్కటంపై కలెక్టర్‌ గంధం చంద్రుడు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే జిల్లాది ప్రత్యేక స్థానమనేందుకు తాజాగా దక్కిన అవార్డు నిదర్శనమన్నారు. ఇంకుడుగుంతలు, చెక్‌ డ్యామ్‌లు, నీటికుంటలు, ట్రెంచులు, నీటి సంరక్షణ పనుల ద్వారా 2.61 టీఎంసీల నీటిని భూగర్భ జ లాలుగా మార్చినందుకు డ్వామాకు స్కోచ్‌ అవార్డు దక్కిందన్నారు. ఫ్లోరైడ్‌ బాధిత 35 గ్రామాలకు వైఎ్‌సఆర్‌ సుజల స్రవంతి ద్వారా రూ.5కే 20 లీటర్ల నీటిని అందించినందుకు ఆర్‌డబ్ల్యూఎ్‌సకు, హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా సముద్ర మట్టానికి 254 మీటర్ల ఎత్తులో ఉన్న నీటిని 723 మీటర్ల ఎత్తులో ఉన్న మడకశిర మండలానికి తీసుకువచ్చి, అక్కడి ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు కృషి చేసిన నీటిపారుదల శాఖలకు ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌లు దక్కాయని కలెక్టర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ కాన్ఫరెన్స్‌లో డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-21T06:28:55+05:30 IST