చోరీల అడ్డా పారిశ్రామికవాడ

ABN , First Publish Date - 2021-01-20T06:16:20+05:30 IST

మండలంలోని పారిశ్రామికవాడలో ఇటీవల చోరీలు అధికమయ్యాయి. నెలరోజులుగా ఐదు ద్విచక్రవాహనాలు, 10వరకు సైకిళ్లు చోరీకి గురయ్యాయి.

చోరీల అడ్డా పారిశ్రామికవాడ
అప్‌గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన్‌


రాత్రిపూట ఇంటికెళ్తున్న కార్మికులపై దాడి చేసి, 

నగదు, సెల్‌ఫోన్లు లాక్కెతున్న దుండగులు

ఇటీవల పట్టపగలే వలస కార్మికుడిపై దాడి

యథేచ్చగా పేకాట, కర్ణాటక మద్యం, గట్కా వ్యాపారం

అరికట్టడంలో పోలీసులు విఫలం


 హిందూపురం టౌన్‌, జనవరి 19: మండలంలోని పారిశ్రామికవాడలో ఇటీవల చోరీలు అధికమయ్యాయి. నెలరోజులుగా ఐదు ద్విచక్రవాహనాలు, 10వరకు సైకిళ్లు చోరీకి గురయ్యాయి. అంతేకాక పరిశ్రమల నుంచి రాత్రిపూట కార్మికులు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో మూడు నాలుగు చోట్ల దాడులకు తెగబడి వారి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌లు లాక్కెళ్లారు. తాజాగా రెండు రోజుల క్రితం ఓ వలస కార్మికుడిని పట్టపగలే విచక్షణారహితంగా దాడిచేశారు. కర్ణాటక మద్యం, గుట్కావ్యాపారం, పేకాటకు అడ్డాగా మారింది. దీంతోపాటు 15రోజుల క్రితం ఇక్కడ పనిచేస్తున్న కార్మికులను కర్ణాటక సరిహద్దుకు తీసుకెళ్లి చితకబాది వారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌లు ఎత్తుకెళ్లారు. వీటన్నింటిని చూస్తుంటే పోలీసులు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో అర్థం అవుతోంది. వీటిలో కొన్ని పోలీసుల దృష్టికి వచ్చినా.. మరికొన్ని రాకుండా పోయాయి. ఇందుకు కారణం స్టేషన్‌కు వెళ్లినా ప్రయోజనం లేదని తెలిసి మిన్నకుండిపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా.?


 అప్‌గ్రేడ్‌ పోలీ్‌సస్టేషన్‌లో సిబ్బంది ఎవరి దారి వారిదే అన్న చందంగా మారింది. ఇందుకు కారణం ఇక్కడ సీఐ లేకపోవడమే ప్రధాన కారణమని పోలీస్‌ సిబ్బందిలోనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నవంబరు 20న సీఐగా శ్రీరామ్‌ బాధ్యతలు స్వీకరించారు. అయితే 23రోజులు తిరగకనే వీఆర్‌కు వెళ్లడంతో అప్పటి నుంచి సీఐను నియమించలేదు. టూటౌన్‌ సీఐకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నాడు. ఇదే అదునుగా భావించిన కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎస్‌ఐ ఉన్నాకానీ సిబ్బందిపై పూర్తిస్థాయిలో పట్టు సాధించకపోవడంతో గతం నుంచి పనిచేస్తున్న కొంతమంది కానిస్టేబుళ్లు అంతా తామై వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోనే పేరుగాంచిన పారిశ్రామికవాడలో ఇటు కార్మికులు, అటు యాజమాన్యం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇక్కడ సీఐను నియమించి శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-01-20T06:16:20+05:30 IST