ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి
ABN , First Publish Date - 2020-12-18T04:22:33+05:30 IST
ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి

అంతరాష్ట్ర, అంతర్జిల్లా, సాధారణ బదిలీలు చేపట్టాలి
ఖాళీ పోస్టుల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వాలి
ఉపాధ్యాయ సంఘాల నేతల డిమాండ్
జిల్లా కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల నిరాహార దీక్ష
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాల విద్య-ఉపాధ్యాయుల పదోన్నతులు, సాధారణ బదిలీలు తదితర సమస్యల పరిష్కారం కోరు తూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద సంయుక్త ఆందోళన నిర్వహించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ నిరాహార దీక్షలు చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ హరీ్షకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఐదున్నరేళ్లుగా ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్య, నూతన జిల్లాల ఏర్పాటు తదితర కారణాలతో ఉపాధ్యాయుల పదోన్నతులు నిలిపివేశారని తెలిపారు. ఎంతో మంది అర్హతగల సీనియర్ ఉపాధ్యాయులు పదోన్నతి పొందకుండానే ఉద్యోగ విరమణ పొందుతూ నష్టపోయారని చెప్పారు. పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, సబ్జె క్టు టీచర్ల కొరతతో విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. 2019 ఫిబ్రవరిలో స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేసిన 10,479 పండిట్, పీఈటీ పోస్టుల్లో ఆయా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించలేదన్నారు. మోడల్ స్కూళ్లు ప్రారంభించి ఏడేళ్లు గడచినా ఒక్కసారి కూడా బదిలీ అవకాశం ఇవ్వలేదన్నారు. అంతరాష్ట్ర, అంతర్జిల్లా, సాధారణ బదిలీల కోసం ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. అప్గ్రేడెడ్ పండిట్, పీఈటీ పోస్టులతో సహా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఖాళీల్లో పాత 10 జిల్లాల ప్రాతిపదికన పదోన్నతుల కల్పనకు షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీకి టీ ఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. దీక్షలో ఉపాధ్యాయ సంఘ నాయకులు ఈ.గాలయ్య, చంద్రారెడ్డి, రాజమణి, ప్రవీణ్కుమార్, ఎం.వెంకటప్ప, రాములయ్య, బషీర్, గోపాల్ పాల్గొన్నారు.