మార్చి నాటికి రూర్బన్‌ పనులు పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-11-22T04:47:05+05:30 IST

మార్చి నాటికి రూర్బన్‌ పనులు పూర్తిచేయాలి

మార్చి నాటికి రూర్బన్‌ పనులు పూర్తిచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న పీడీ కృష్ణ

జిల్లా డీఆర్‌డీఏ పీడీ కృష్ణ

తాండూరు రూరల్‌  : తాం డూరు మండలం అల్లాపూర్‌ క్లస్టర్‌ పరిధిలో రూర్బన్‌ పథకం కింద పెండింగ్‌లో ఉన్న పనులన్నీ వచ్చే మార్చి ఆఖరు నాటికి పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా డీఆర్‌డీఏ పీడీ కృష్ణ ఆదేశించారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో రూర్బన్‌ పథకం పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ 2016లో కేంద్ర ప్రభుత్వం అల్లాపూర్‌ క్లస్టర్‌ కింద మండలానికి రూ.30కోట్లతో 1,049 పనులను మంజూరు చేసిందన్నారు. ముందస్తుగా రూ.25కోట్ల విలువైన పనులను విడుదల చేసిందన్నారు. మూడేళ్లలో ఇప్పటి వరకు మండల పరిధిలో రూ.18కోట్లతో పనులు పూర్తయ్యాయని, మరో రూ.11.81 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయన్నారు. 185 పనులు ఇప్పటికీ ఇంకా ప్రారంభించలేకపోయామని, వాటిని ప్రారంభించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మార్చిలోగా పూర్తికాకుంటే నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉందన్నారు. సమావేశం జడ్పీటీసీ గౌడి మంజుల, సీడీపీవో రేణుక, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌ ఏఈలు ప్రణీత్‌, సంతో ష్‌కుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ధనంజయ, రూర్బన్‌ ప్రతినిధి వినోద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-22T04:47:05+05:30 IST