వరికి మానిపండు, కాటుక తెగుళ్లు
ABN , First Publish Date - 2020-10-08T10:53:33+05:30 IST
వరి పైర్లకు మానిపండు, కాటుక తెగుళ్లు వ్యాపిస్తున్నాయని, ఈదశలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఘట్కేసర్ మండల వ్యవసాయ అధికారి ఎంఏ బాసిత్ అన్నారు.

ఘట్కేసర్ : వరి పైర్లకు మానిపండు, కాటుక తెగుళ్లు వ్యాపిస్తున్నాయని, ఈదశలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఘట్కేసర్ మండల వ్యవసాయ అధికారి ఎంఏ బాసిత్ అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని బొక్కోనిగూడలో బుధవారం ఆయన వరి పైర్లను పరిశీలించారు. ఆయా చోట్ల రైతులతో మాట్లాడుతూ పలుచోట్ల వరిపొలాలకు మానిపండు, కాటుక తెగుళ్లను గుర్తించినట్లు తెలిపారు. ఈఏడాది విస్తారంగా వర్షాలు కురువడంతో పెద్ద ఎత్తున వరిసాగు చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం పైర్లు ఎక్కువగా పూత దశలో ఉన్నాయని గుర్తుచేశారు. కొన్ని పైర్లు మాత్రం గింజలు పాలు పోసుకునే దశలో ఉన్నట్లు తెలిపారు. పొలాలకు ఇది ఎంతో కీలక సమయమన్నారు. ఈదశలోనే పైర్లను తెగుళ్లు, చీడపీడలు ఆశిస్తాయన్నారు. ప్రస్తుతం గింజలు గట్టిపడుతున్న పైర్లలో మానిపండు, కాటుక తెగుళ్లు కనిపిస్తున్నట్లు వివరించారు. పైర్లు పూత దశలో ఉన్న రైతులు కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటరు నీటికి మూడు గ్రాముల చొప్పున లేదా ప్రాఫి కోనా జోల్ మందును ఎకరాకు 200 గ్రాముల మందును వారం రోజులకోసారి రెండుసార్లు పిచికారీ చేయాలని సూచించారు.
రైతులు ప్రతిరోజు పైర్లను నిశితంగా పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి అనుమానం వచ్చినా తమకు సమాచారం అందించాలని కోరారు.