రైతువేదికకు తుదిమెరుగులు
ABN , First Publish Date - 2020-12-08T05:06:02+05:30 IST
రైతువేదికకు తుదిమెరుగులు

- భవనాన్ని పరిశీలించిన ఎంఏవో
- త్వరలో ప్రారంభోత్సవానికి చర్యలు
శామీర్పేట: మూడుచింతలపల్లిలో నిర్మిస్తున్న రైతువేదిక భవనం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఈ భవన నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి రూ.20లక్షలు మంజూరు చేసి రైతులకు అండగా నిలిచారు. భవన నిర్మాణానికి స్థానిక దుర్గమ్మ ఆలయ సమీపంలో గత జూలైలో మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ వేదిక భవనాన్ని అందమైన రంగులతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే ఈ భవనం ప్రస్తుతం 95శాతం నిర్మాణ పనులు పూర్తయి తుది మెరుగులను దిద్దుకుంటోంది. సోమవారం మండల వ్యవసాయాధికారి క్రిష్ణవేణి, ఏఈవో జ్యోతిలు నర్మాణ పనులను పర్యవేక్షించారు. ఎలాంటి లోపాలు లేకుండా కాంట్రాక్టరు నాణ్యతగానే నిర్మించినట్లు ఎంఎవో పరిశీలనలో వెల్లడించారు. మరో పదిరోజుల్లో ఈ భవనాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారు. తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంఏవో వివరించారు.