నేతల మధ్య ముదిరిన వివాదం
ABN , First Publish Date - 2020-03-21T05:40:20+05:30 IST
మొన్నటి వరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మధ్య ఏర్పడిన ప్రొటోకాల్ వివాదం ఇప్పుడు స్థానిక ప్రజా ప్రతినిధుల
![నేతల మధ్య ముదిరిన వివాదం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020032112085647/03212020001003n58.jpg)
- స్థానిక ప్రజాప్రతినిధులు లేకుండా ప్రారంభోత్సవాలు
తాండూరు : మొన్నటి వరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మధ్య ఏర్పడిన ప్రొటోకాల్ వివాదం ఇప్పుడు స్థానిక ప్రజా ప్రతినిధుల మద్య రాజుకుంటోంది. అధికారులు ప్రోటోకాల్పై స్థానిక ప్రజా ప్రతినిధులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం, నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికారులు సైతం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రధానంగా యాలాల మండలంలో ప్రోటోకాల్ వివాదం మరింత ముదిరింది. మండల పరిధిలోని గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అగ్గనూరులో రూ.20లక్షలతో చేస్తున్న సీసీ రోడ్డు పనులను యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీపీ బాలేశ్వర్గుప్తాకు సమాచారం అందించలేదు. గోవింద్రావుపేట్కు రూ.50లక్షలతో వేసిన బీటీ రోడ్డు పనులను స్థానిక సర్పంచ్, సిద్రాల శ్రీనివాస్ సతీమణి సిద్రాల సులోచన పంచాయతీరాజ్ డీఈ గోపినాథ్ సమక్షంలో ప్రారంభించారు. అక్కడ స్థానిక ఎంపీటీసీ, యాలాల ఎంపీపీ బాలేశ్వర్గుప్తా, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డికి సమాచారం లేదు. ఈ విషయమై ప్రోటోకాల్ను ఉల్లంఘించారని, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్కు ఫిర్యాదు చేశారు. మండలంలోని బషీర్మియాతండాలో గ్రామ సర్పంచ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినపుడు ప్రారంభ కార్యక్రమానికి ఎంపీపీని, సీఐని తదితర మండల నాయకులను ఆహ్వానించినప్పటికీ స్థానిక ఎంపీటీసీగా ఉన్న కరణం పురుషోత్తంరావును ఆహ్వానించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి సిద్రాల శ్రీనివాస్ను తప్పించేందుకు ఎమ్మెల్యే వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అధికారులు మాత్రం ప్రోటోకాల్ పరిధిలోకి ఎవరు వస్తారు. ఎవరిని పిలవాలో అనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రోటోకాల్ సమస్య ముదురుతోంది.