కమలానికి కలిసొచ్చింది
ABN , First Publish Date - 2020-12-29T04:47:47+05:30 IST
బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయన్న చందమైంది జిల్లాలో పార్టీల పరిస్థితి.
![కమలానికి కలిసొచ్చింది](https://media.andhrajyothy.com/appimg/galleries/2020122811161792/12282020231715n54.jpg)
- గులాబీకి ఎదురుదెబ్బలు
- కాంగ్రెస్కు కష్టకాలం
బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయన్న చందమైంది జిల్లాలో పార్టీల పరిస్థితి. ఈ ఏడాది మొదట్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో స్పీడు చూపించిన కారు.. గ్రేటర్ ఎన్నికల్లో డీలా పడింది. అంచనాలు తలకిందులు చేస్తూ గ్రేటర్లో కమలం వికసించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోయింది. ఇక టీడీపీ అయితే ఖాతానే తెరవలేదు. 2020లో జరిగిన అనూహ్య మార్పులతో భవిష్యత్ రాజకీయాలు రసకందాయకంగా ఉండే అవకాశం ఉంది.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : ఈ ఏడాది రాజకీయంగా అనూహ్యమార్పులు చోటుచేసుకున్నాయి. అధికార టీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బలు తగలగా భారతీయ జనతా పార్టీకి కాలం కలిసి వచ్చింది. ఏడాది ఆరంభంలో జరి గిన మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా సీట్లు కైవసం చేసుకున్న అధికార టీఆర్ ఎస్ పార్టీకి గ్రేటర్ఎన్నికల్లో నాటికి ఎదు రీత తప్పలేదు. అలాగే నిన్నమొన్నటి వరకు బలమైన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు కుదేలయ్యాయి. ఈ రెండుపార్టీల స్థానంలో బీజేపీ గణనీ యంగా బలం పుంజుకుంది. ఏడాది చివ రిలో జరిగిన గ్రేటర్ ఎన్నికలు భవిష్య త్తుపై బీజేపీ కొండంత బలాన్నిచ్చాయి. అధికార టీఆర్ఎస్ స్వయంకృతాపరా ధంతో బలమైన ప్రాంతాల్లో పట్టు కోల్పోయింది. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అనేకచోట్ల బలపడింది. ఏడాది ఆరంభంలో అంటే జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. కొన్నిచోట్ల వార్డులు తగ్గినప్పటికీ ఎక్స్అఫిషియో ఓట్లతో నెగ్గింది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లను అధికార టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అలాగే 12 మున్సిపాలి టీలకుగానూ ఎనిమిది మున్సిపాలిటీలను చేజిక్కించుకుంది. రెండు చోట్ల కాంగ్రెస్, ఒక చోట బీజేపీ, మరో చోట ఎంఐఎం పాగా వేశాయి. అలాగే మేడ్చల్ జిల్లాలో నాలుగు కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు ఉండగా అన్నిచోట్ల అధికార టీఆర్ఎస్ పాగావేసింది. వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలి టీలను టీఆర్ఎస్ వశం చేసుకుంది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ దెబ్బ తింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 64 డివిజన్లలో 36 స్థానాలు మాత్రమే గెలుచు కోగలిగింది. గత ఎన్నికలతో పోలిస్తే 26 డివిజన్లను టీఆర్ఎస్ కోల్పోయింది. గతంలో ఒక డివిజన్కే పరిమితమైన బీజేపీ ఈసారి 24 సీట్లు గెలుపొందడం గమనార్హం. కాంగ్రెస్ రెండు డివిజన్లకు పరిమితం కాగా, టీడీపీ అసలు ఖాతానే తెరవలేదు. ఎంఐఎం మాత్రం రెండు డివిజన్లలో విజయం సాధిం చింది. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ అసలు ఖాతానే తెరవక పోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని 13డివిజన్లను బీజేపీ స్వీప్ చేసింది. రాజేంద్రనగర్లో టీఆర్ఎస్కు ఒక్క డివిజన్ దక్కలేదు. మంత్రి సబితారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మహేశ్వరంలో రెండు స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. అలాగే మంత్రి మల్లారెడ్డి బాధ్యత తీసు కున్న ప్రాంతాల్లో టీఆర్ఎస్ దెబ్బతింది. ఇక కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే ఉంది. కాం గ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 46డివిజన్లకుగానూ రెండు డివిజన్లలోనే కాంగ్రెస్ నెగ్గింది. ఇదిలాఉంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. సోమవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. గత కొంతకాలంగా టీఆర్ఎస్ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మున్సిపల్ చైర్మన్ కొత్త ఆర్తిక టీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన కొత్త ఆర్తిక మున్సిపల్ చైర్మన్ అయ్యారు. పార్టీలో విభేదాల కారణంగా విసిగిపోయిన ఆమె టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమక్షంలో మంగళ వారం కాంగ్రెస్ సొంతగూటికి చేరారు.
నేలకొరిగిన నేతలు
ఈ ఏడాది రాజకీయాల్లోనూ విషాదఘటనలు జరిగాయి. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు పేరొందిన రాజకీయ నేతలు నేలకొరిగారు. పాత తరం కాంగ్రెస్ నేత మాజీ రెవెన్యూ మంత్రి కమతం రామిరెడ్డి అకాల మరణం చెందారు. అలాగే మరో మాజీ మంత్రి సురేందర్రెడ్డి తనువు చాలించారు. ఎన్టీఆర్ హయాంలో ఆయన అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ అనారోగ్యంతో మరణించారు.