నట్టల నివారణ మందుతో వ్యాధినిరోధక శక్తి
ABN , First Publish Date - 2020-12-02T04:47:26+05:30 IST
నట్టల నివారణ మందులో జీవాలకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని పశువైద్య, సంవర్ధకశాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.

- పశువైద్య, సంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ లక్ష్మారెడ్డి
పరిగి : నట్టల నివారణ మందులో జీవాలకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని పశువైద్య, సంవర్ధకశాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. నట్టల నివారణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పరిగి మండలం మిట్టకోడూరు గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, నట్టల నివారణ మందు వేయడం ద్వారా జీవాలు బరువు పెరిగి, పునరుత్పత్తి సులభమవుతుందన్నారు. నట్టల నివారణ మందు రాష్ట్రవ్యాప్తంగా అన్నిగ్రామాల్లో వారంరోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. ఈనెలలోనే పెద్ద పశువులకు కూడా నట్టల నివారణ మందుల కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని, తదుపరి గాలికుంటు వ్యాధినిరోధక శక్తి పెంచే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని పశువైద్యాశాలలకు రాయితీ పశుగ్రాస విత్తనాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వసంతకుమారి, సహాయ సంచాలకుల ప్రహ్లాద్, అంకంరాజు, ఆయా మండలాల వైద్యాధికారులు సుజాత్అలీ, నాగప్రసాద్, ఆనంద్, గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ జహిరాబీ, మాజీ సర్పంచి జగదీశ్వర్, ఉపసర్పంచ్ నర్సింహులు, గ్రామ గొర్రెలకాపరుల సంఘం అధ్యక్షుడు మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.