ప్రజలకు అందుబాటులో ఉండాలి
ABN , First Publish Date - 2020-09-13T09:06:09+05:30 IST
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మెలిగి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అన్నారు.
![ప్రజలకు అందుబాటులో ఉండాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి
యాలాల : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మెలిగి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అన్నారు. శనివారం యాలాలలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని అన్నారు. ఈ ఏడాది అధికంగా వర్షాలు కురిసినందున కంది, పెసర పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాండూరు-కొడంగల్ మార్గంలో కాగ్నా వంతెనపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలోనే పూర్తవుతాయన్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా వరకు పాడైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పనులకు ఇసుక అనుమతికి అధికారులు చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ బాలేశ్వర్గుప్తా, మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తంరావు, కో-ఆప్షన్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అక్బర్బాబా, తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీరాజ్ డీఈ గోపీనాథ్, ఏవో జోత్స్న, ఎంఈవో సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.