-
-
Home » Telangana » Rangareddy » minister sabithareddy
-
పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి
ABN , First Publish Date - 2020-12-20T04:44:21+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

- విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
కందుకూరు: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ర్టీయ గ్రామీణ స్వరాజ్ యోజన పథకం ద్వారా మండలపరిధిలోని సరస్వతిగూడ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి మంజూరైన రూ.20లక్షలతో శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. నూతనంగా ఏర్పాటైన ప్రతి గ్రామపంచాయతీకి ప్రత్యేక భవనం నిర్మించడానికి సీఎం కేసీఆర్ కార్యాచరణ ప్రణాళికను తయారుచేయడం జరిగిందన్నారు. అందులోభాగంగా మహేశ్వరం, కందుకూరు మండలా లకు మొదటివిడతలో రెండు గ్రామపంచాయతీల భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా రూ.339కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న రేషన్కార్డులు, పెన్షన్ల మంజూరుకు మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి వచ్చే మార్చి నాటికి అర్హులైన వారికి అందజే స్తామన్నారు. దీంతోపాటు ప్రభుత్వం అర్బన్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూముల మాదిరిగానే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిస్థలం ఉన్న నిరుపేదలందరికీ ఇంటినిర్మాణం కోసం రూ.5లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. సరస్వతిగూడ గ్రామంలో ఇటీవల శిక్షణ పొందిన మహిళలందరికీ కుట్టుమిషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు పక్కనే ఉన్న ఫారెస్టులో రైతులు పశువులను మేపుకోవడానికి అనుమతులు ఇప్పించాలన్న కోరిక మేరకు... త్వరలో జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, వైస్ ఎంపీపీ జి.శమంత, సహకార సంఘం చైర్మన్ డి.చంద్రశేఖర్, వైస్చైర్మన్ జి.విజయేందర్రెడ్డి, మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.వరలక్ష్మీసురేందర్రెడ్డి, డైరెక్టర్లు పొట్టి ఆనంద్, ఎస్ శేఖర్రెడ్డి, ఎస్.పాండురంగారెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఎస్. రాజశేఖర్రెడ్డి, సర్పంచ్లు రాము, కె.రామక్రిష్ణారెడ్డి, జె.పరంజ్యోతి, బి.నరేందర్గౌడ్, సదాలక్ష్మి, ఉపసర్పంచ్ కవిత, ఎంపీటీసీలు యాదయ్య, కాకి రాములు, ఎంపీడీవో జి.క్రిష్ణకుమారి, తహసీల్దార్ ఎస్.జ్యోతి, ఆర్ఐ మదన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.