ఊరికి చేరేదెట్ట?
ABN , First Publish Date - 2020-03-27T11:46:07+05:30 IST
వలస జిల్లాగా పేరొందిన పాలమూరు నుంచి భాగ్యనగరానికి వెళ్లిన ఎంతోమంది కూలీలు కరోనా ప్రభావంతో స్వగ్రామాల బాట పడుతున్నారు. హైదరాబాద్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో
లాక్డౌన్తో వలస కూలీలకు కష్టాలు
నగరంలో పనిలేక కాలినడకన స్వగ్రామాలకు
వాహనాలు లేక.. నీళ్ళు దొరకక అవస్థలు
షాద్నగర్: వలస జిల్లాగా పేరొందిన పాలమూరు నుంచి భాగ్యనగరానికి వెళ్లిన ఎంతోమంది కూలీలు కరోనా ప్రభావంతో స్వగ్రామాల బాట పడుతున్నారు. హైదరాబాద్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో భయాందోళనకు గురై కూలీలు స్వగ్రామాలకు వెళ్లడానికి కాలినడకే శరణ్యమైంది. ఆర్టీసీ బస్సులు, రైళ్ళు, ప్రైవేట్ వాహనాలు పూర్తిగా బంద్కావడంతో వంద కిలోమీటర్లు సైతం కాలినడకన వెళ్తూ కనిపిస్తున్నారు. వారిలో కొందరు యువకులు కాగా.. మరెందరో మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. చిన్నారులను సైతం ఎత్తుకుని ఎంతోమంది తల్లులు ఎర్రటి ఎండలో కాలినడకన వెళ్తున్నారు. పాలమూరు జిల్లాలోని జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, గద్వాల తదితర ప్రాంతాలకు చెందిన కూలీలు జాతీయ రహదారి, బైపాస్ రోడ్లలో గుంపులుగా కాలినడకన వెళ్తున్నారు.
వారిని ఆంధ్రజ్యోతి పలకరించగా... ప్రభుత్వం వాహనాలన్నంటినీ బంద్ చేయడంతో దిక్కుతోచని పరిస్థితిలో వందలాది కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 100కు డయల్ చేస్తే స్పందన లేదు. దీంతో తప్పని పరిస్థితిలో ఎర్రటి ఎండలో నడవాల్సి వస్తుందని కూలీలు ఆవేదన చెందారు. తాము తెల్లవారుజామున 3.00 గంటలకు హైదరాబాద్లో బయలుదేరామని, మధ్యాహ్నం 12.30 గంటలకు షాద్నగర్కు చేరుకున్నామని తెలిపారు. మా స్వగ్రామాలకు చేరుకోవ డానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని వాపోయారు. కొన్ని ప్రైవేట్ వాహనాలు రోడ్లపై తిరుగుతున్నా... ఎవరూ తమను ఎక్కించు కోవడంలేదని తెలిపారు. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించక ముందే తమకు ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చి మా స్వగ్రామాలకు పం పాల్సి ఉండేదని అంటున్నారు.
ఇంతదూరం ఎండలో నడిచి వస్తున్న తమకు ఎక్కడ కూడా ఒక హోటల్ గానీ, కనీసం తాగేనీరు గానీ దొరకలేదని బోరుమన్నారు. కరోనా మహమ్మారితో మృతి చెందేది దేవుడెరుగు కానీ మా స్వగ్రామాలకు వెళ్లే వరకు ప్రాణాలు ఉంటాయో... పోతాయో.. కూడా తెలియడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే కూలీలు, నిరుపేదలకు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాలని వారు కోరారు.
బస్సులు బంద్ చేస్తే ఎట్ల పోవాలె?
ప్రభుత్వం బస్సులు బంద్ చేస్తే మా ఊర్లకు ఎట్ల పోవాలె..? మబ్బుల 3గంటలకు పట్నంలో ఎల్తే పన్నెండు గంటలకు గీడికి ముట్టినం. మా ఊరికి పోయేసరికి పానాలే పోతయేమో. పట్నం కెల్లి గీడివరకు తాగనీకి నీళ్ళు దొరకలే. తిననీకి పండ్లు దొరకలె. మాలోంటోళ్ళు ఊర్లళ్ళకు వెల్లనీకె ప్రభుత్వం బండ్లు పెట్టాలె.
వెంకటయ్య, కూలీ, దేవరకద్ర
పిల్లనెత్తుకుని పట్నంకెల్లి వస్తున్న..
మా ఊరికి వెల్లనీకి బస్సులు లేకపాయె... రైళ్ళు లేకపాయె... ఏంజె యాల్నో తెలవక పిల్లనెత్తుకుని పట్నంకెల్లి నడుసుకుంటొస్తున్న. పట్నంల ఉందామంటే భయమై తుంది. ఊరికి పోదమంటే బండ్లు లేవు. పట్నంకెల్లి గీడిదాక నీళ్ళు కూడా దొరకలె. ఒకాయన నన్ను చూసి కొద్ది దూరం బండి మీద ఎక్కించుకొచ్చిండు. ప్రభుత్వం మాలాంటోళ్ళ కోసం ఆటోలు పెట్టాలె.
లక్ష్మి, కూలీ, జడ్చర్ల