నట్టల నివారణ మందు వేయించాలి
ABN , First Publish Date - 2020-12-02T04:53:16+05:30 IST
నట్టల నివారణ మందు వేయించాలి

- పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి
చేవెళ్ల: తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన చేవెళ్ల డివిజ న్ పశుసంవర్ధక శాఖ డాక్టర్ బిజియాదేవితో కలిసి గొర్రెలకు, మేకలకు నట్టల మందులు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ గర్భధారణ కార్యక్రమం కింద పశువులకు ఉచిత గర్భధారణ సూదులు ఇవ్వడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం రైతులకు 75శాతం సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తోందన్నారు. దీన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల్లో వైద్యసిబ్బంది వచ్చి గొర్రెలకు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు వేస్తారని, రైతులు తమ జీవాలకు వేయించాలని ఆయన సూచించారు. జీవాలకు నట్టల నివారణ మందులు వేయడం ద్వారా బొబ్బరోగం, పారుడు రోగం, చిటుక రోగం, గొంతు వాపు, తదితర జబ్బులను నివారించేందుకు వీలవుతుందన్నారు. ఏడాదిలో మూడు సార్లు ఉచితంగా టీకాలు వేస్తామన్నారు. పశువులు, జీవాలు ఉన్న వారు తప్పకుండా వేయించాలన్నారు.