‘దేర్ సే’ ముబారక్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సాయం మంజూరులో తీవ్ర జాప్యం
ABN , First Publish Date - 2020-03-16T05:46:59+05:30 IST
పేదింటి ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.
నెలల తరబడి పెండింగ్లో దరఖాస్తులు
కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారుల ప్రదక్షిణలు
జిల్లాలో 3,787మంది లబ్ధిదారుల ఎదురుచూపులు
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల దరఖాస్తులకు నెలల వ్యవధిలోనే మోక్షం
బీసీల దరఖాస్తులు ఏడాదికి పైగా పెండింగ్
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్జిల్లా ప్రతినిధి):పేదింటి ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. దీని కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల ఆడపడుచులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోంది. ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున మంజూరు చేస్తోంది. ప్రభుత్వం మొదట ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ పథకాన్ని అమలు చేసింది. అనంతరం బీసీ, ఈబీసీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకుంది. సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి కష్టాలు ఎదురవుతున్నాయి. పెళ్లయిన నెలరోజుల్లోనూ ఈ పథకం కింద తల్లిదండ్రుల చేతికి సాయం సొమ్ము అందించాలి. అయితే వివాహాలై ఏడాది గడుస్తున్నా వీరికి ఆర్థిక సహాయం అందడం లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకున్న కొంత వ్యవధిలో మంజూరవుతున్నాయి. నిధుల మంజూరులో ఆయా వర్గాలకు జాప్యం లేకుండా అందిస్తున్నారు. బీసీ, ఈబీసీ వర్గాల లబ్ధిదారులకు మాత్రం నెలలు గడుస్తున్నా.. దరఖాస్తులు ముందుకు సాగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా బీసీ సంక్షేమ శాఖలో నిధులలేమి కారణంగా కల్యాణలక్ష్మి సాయం మంజూరు కావడంలేదని సమాచారం.
జిల్లావ్యాప్తంగా 12,073 దరఖాస్తులు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మేడ్చ ల్ మల్కాజ్గిరి జిల్లాలో ఇప్పటివరకు 12,073 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 11,267 దరఖాస్తులను పరిశీలించారు. మొత్తం 11,137 దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. మొత్తం 130 దరఖాస్తులను నిబంధనల ప్రకారం లేవని తిరస్కరించారు. 806 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 10,240 వరకు దరఖాస్తులను ఎమ్మెల్యేలు ఆమోదించారు. 6,729వరకు బిల్లులు సమర్పించగా, 6,453 బిల్లులు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 5,651 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం మంజూరు కోసం జిల్లాలోని కీసర, మల్కాజ్గిరి రెవెన్యూ డివిజన్లలోని 15 మండలాల్లో మొత్తం 3,787 మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి పెళ్లయిన నెలరోజుల వ్యవధిలోనే ప్రభుత్వం చెక్కులు అందించాల్సి ఉండగా, ఆచరణలో మాత్రం అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి. బీసీ లబ్ధిదారులకు మాత్రం వేదన తప్పడం లేదు. నిధులు ఎన్నాళ్లకు మంజూరవుతాయోనని లబ్ధిదారులు అయోమయానికి గురువుతన్నారు. ఈ పథకం కింద నిధులు మంజూరు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో దరఖాస్తుదారులు తహసీల్దార్, ఆర్డీవోల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అప్పులు చేసి బిడ్డల పెళ్లిళ్లు చేసిన తల్లిదండ్రులు ప్రభుత్వ ఆర్థికసాయం పొందేందుకు సకాలంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, దరఖాస్తులను పెండింగ్లో ఉంచడంతో నెలల తరబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో తమతో పాటు పెళ్లిళ్లు చేసిన వారికి నెలలకొద్దీ ఎదురుచూపులు తప్పడం లేదు. ఎప్పుడు మంజూరవుతుందంటూ తరచూ అధికారులను ఆశ్రయిస్తున్నారు. దరఖాస్తులన్నీ పరిశీలించి, నిధులు మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, డబ్బులు విడుదల కాగానే చెక్కులను పంపిణీ చేస్తామని దరఖాస్తుదారులకు సమాధానావ్వడం అధికారుల వంతయింది. దీంతో కార్యాలయాలకు వచ్చిన లబ్ధిదారులు నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సాయం మంజూరు చేయాలని పలువురు దరఖాస్తుదారులు కోరుతున్నారు.