ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని హరిత ట్రిబ్యునల్ తీర్పు
ABN , First Publish Date - 2020-12-04T04:50:17+05:30 IST
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని హరిత ట్రిబ్యునల్ తీర్పు

తాండూరు : తాండూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ కోర్టు తీర్పును వెల్లడించింది. తాండూరులో ఇసుక అక్రమ రవాణాపై పూర్తి వివరాలతో కూడిన పర్యావరణ ప్రేమికుడు రాజ్గోపాల్ సార్డా చెన్నై హరిత ట్రిబ్యూనల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం కేవలం పర్యావరణ చట్టాలకు అనుకూలంగానే నదీ భూభాగం నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని కోర్టు సూచించింది. పర్యావరణ కమిటీ అనుమతి తప్పనిసరి పొందాలని కోర్టు సూచించింది. నదీ భూభాగంలో ఇసుక లభ్యత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇసుక అక్రమ రవాణా జరుగకుండా అనునిత్యం పర్యవేక్షించడానికి జిల్లా యంత్రాంగం తప్పకుండా టాస్క్ఫోర్స్ను నియమించాలని సూచించింది. ఇసుక రవాణా వాహనానికి జీపీఎస్ యంత్రం తప్పకుండా అమర్చి ఏ ఉద్దేశానికి ఇసుక నిర్ధేశించబడినదో, దాని కోసమే తరలివెళ్తున్నదా? లేదా? అని ఎప్పటికప్పడు గమనిస్తూ రికార్డు నమోదు చేయాలని, అక్రమ రవాణా అరికట్టాలని సూచించింది. ఒకవేళ ఇసుక అక్రమంగా తరలినట్లయితే ఇసుక వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేయాలని, రాయల్టీ, పెనాల్టీని ఎప్పటికప్పుడు జమ చేయాలని కోర్టు సూచించింది. ప్రతివాదులైన కలెక్టర్, ఆర్డీవో, పోలీసు, గనులు, రెవెన్యూ శాఖ భాగం ఎన్జీటీ ముందుంచిన హామీని తప్పనిసరి అమలు చేయాలని కోర్టు సూచించింది.