హైదరాబాద్‌ - శ్రీశైలం హైవేపై సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్ల ఏర్పాటుకు నిధులు

ABN , First Publish Date - 2020-12-20T04:48:20+05:30 IST

హైదరాబాద్‌ - శ్రీశైలం జాతీయరహదారిపై సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్ల ఏర్పాటుకు

హైదరాబాద్‌ - శ్రీశైలం హైవేపై సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్ల ఏర్పాటుకు నిధులు
సమావేశంలో మాట్లాడుతున్న తల్లోజు ఆచారి

  •  ఎన్‌హెచ్‌ఏఐ నుంచి రూ.4.71 కోట్లు మంజూరు : తల్లోజు ఆచారి


ఆమనగల్లు : హైదరాబాద్‌ - శ్రీశైలం జాతీయరహదారిపై సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.4.71 కోట్లు మంజూరు చేసినట్లు జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి తెలిపారు. భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ నుంచి ఈమేరకు ఉత్తర్వులు జారీ అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు మున్సిపల్‌ కార్యాల యంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆచారి మాట్లాడుతూ... ఐదేళ్ల క్రితం శ్రీశైలం-హైదరాబాద్‌ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించినా డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు తీవ్రఇబ్బందులు పడటంతోపాటు అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈనేపథ్యంలో సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్ల ఏర్పాటుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి, జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌, సభ్యులను కలిసి అభ్యర్థించినట్లు తెలిపారు. ఈ జాతీయ రహదారిపై కందుకూరు. కడ్తాల, మైసిగండి, విఠాయిపల్లి, ఆమనగల్లు, వెల్దండ, డిండి మార్గంలో సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్లు ఏర్పాటుచేయడం జరుగుతుందని ఆయన వివరించారు. అదేవిధంగా ఆమనగల్లు పట్టణంలోని రాజీవ్‌చౌరస్తాలో, వెల్దండ మండలం కొట్ర గేటు వద్ద జంక్షన్ల, సిగ్నల్స్‌, సెంట్రల్‌లైటింగ్‌ ఏర్పాటుకు రూ.1.20 కోట్లు మంజూరైనట్లు ఆచారి పేర్కొన్నారు. శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయరహదారిని నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించిందని ఆచారి తెలిపారు. అదేవిధంగా ఆమనగల్లు మున్సిపల్‌ నిధుల నుంచి కోటి రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి తీర్మానించినట్లు ఆచారి పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆచారిని మున్సి పల్‌ పాలకవర్గం, బీజేపీ నాయకులు సత్కరించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ నేనా వత్‌ రాంపాల్‌నాయక్‌, వైస్‌ చైర్మన్‌ భీమనపల్లి దుర్గయ్య, మాజీ జడ్పీటీసీ కండె హరిప్రసాద్‌, బీజేపీ జిల్లా కార్యదర్శి గోరటి నర్సింహ, మున్సిపల్‌ కౌన్సిలర్లు చెక్కాల లక్ష్మణ్‌, సుండూరు ఝాన్సీశేఖర్‌, చెన్న కేశవులు, కృష్ణయాదవ్‌, మేడిశెట్టి శ్రీధర్‌, దివ్యశ్రీకాంత్‌ ఉన్నారు. 



Updated Date - 2020-12-20T04:48:20+05:30 IST