ఉపాధి హామీలో ‘ఫీల్డ్‌’ కష్టాలు

ABN , First Publish Date - 2020-05-18T10:58:42+05:30 IST

ఉపాధి హామీ పనులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కలుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫీల్డ్‌ కష్టాలు నెలకొన్నాయి.

ఉపాధి హామీలో ‘ఫీల్డ్‌’ కష్టాలు

ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేక క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ కరువు

బాధ్యతలు మాకొద్దంటున్న పంచాయతీ కార్యదర్శులు


తాండూరు : ఉపాధి హామీ పనులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కలుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫీల్డ్‌ కష్టాలు నెలకొన్నాయి. మరో వైపు ఈ బాధ్యతలు మాకొద్దంటూ మండల, డివిజన్‌ స్థాయిల్లో పంచాయతీ కార్యదర్శులు వినతిపత్రాలను అందజేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లదే కీలక పాత్ర. పొమ్మనలేక పొగ పెట్టిన చందంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లకు కొత్త విధులను పేర్కొంటూ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. దీంతో వారు సమ్మెకు వెళ్లగా ప్రభుత్వం మళ్లీ వారిని విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఉపాధి పనులను పూర్తిస్థాయిలో పర్యవేక్షించే పరిస్థితి కనిపించడం లేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలు అక్కడ ఉండలేక సొంతూళ్లకు తిరిగి వచ్చారు.


ఇతర పనులకు వెళ్లే వారికి కూడా ఉపాధి లేకపోవడంతో ఊర్లకు ఊర్లు కూలీ పనులు చేసేందుకు కదిలాయి. ఈ నేపథ్యంలో పని కల్పించడం, మస్టర్‌ నిర్వహణ, వేతనాలు జనరేట్‌చేయడం, పనులు మంజూరు వంటి పనులు గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు చేసేవారు. ఫీల్డ్‌లో కూలీల హాజరు కూడా వారే తీసుకునేవారు. ప్రస్తుతం ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు లేకపోవడంతో పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. పంచాయతీ కార్యదర్శికి ఉపాధి హామీ పర్యవేక్షణ, ఫీల్డ్‌ అసిస్టెంట్లు చేసే పనులన్నింటినీ అప్పగించారు. అసలే 30 రకాల విధులతో సతమతమవుతూ.. ఈ అదనపు బాధ్యతలు మాకొద్దంటూ కార్యదర్శులు వాపోతున్నారు. 

Updated Date - 2020-05-18T10:58:42+05:30 IST