ఎగబాకిన ’ఎగ్’..!
ABN , First Publish Date - 2020-09-14T09:59:28+05:30 IST
కోడిగుడ్డు అత్యంత పోషకాహారం... రోజుకో గుడ్డును తింటే మనిషి ఆరోగ్యవంతంగా ఉంటాడని వైద్యులూ అంటున్నారు.
‘కొవిడ్’తో పెరిగిన కోడిగుడ్ల వినియోగం..
పౌలీ్ట్రలో తగ్గిన గుడ్ల ఉత్పత్తి
హోల్సేల్గా గుడ్డు ధర రూ. 5.20, రిటైల్గా రూ.6
ఇదే దారిలో పెరుగుతున్న చికెన్ రేటు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : కోడిగుడ్డు అత్యంత పోషకాహారం... రోజుకో గుడ్డును తింటే మనిషి ఆరోగ్యవంతంగా ఉంటాడని వైద్యులూ అంటున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. దీంతో వాటిని కొనాలంటేనే జంకాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కోడిగుడ్డు ధర హోల్సేల్గా రూ. రూ.5.20కి విక్రయిస్తుండగా రిటైల్గా రూ.6కు అమ్ముతున్నారు. రోజుకోసారో, రెండు రోజులకోసారో కోడిగుడ్డును తీనేవారు.. ధర పెరగడంతో గుడ్ల వినియోగం తగ్గే అవకాశం ఉంది. కోడిగుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. మూడు వారాల నుంచి ధర అమాంతంగా పెరుగుతూ వస్తోంది. అక్టోబరు నెలలో హోల్సేల్ గుడ్ల విక్రయ ధరల్లో వంద కోడిగుడ్లకు హోల్సేల్గా 4 రూపాయలు, రిటైల్గా 5 రూపాయలు పలికింది. గుడ్ల ధరలు పెరగడానికి కారణం... కరోనా నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు గుడ్ల వినియోగం పెరిగింది. కానీ... గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు మండిపోతున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి కోళ్ల ద్వారా వస్తుందని ప్రచారం జరగడంతో మూడు నెలల క్రితం చికెన్ తినడమే మానేశారు. దీంతో అప్పట్లో పౌల్ర్టీ రంగం కుదేలైంది. కోళ్లను ప్రాణముండగానే జేసీబీలతో గుంత తవ్వి పాతి పెట్టేశారు. చీప్గా రూ.50కి కోడి విక్రయించారు. తర్వాత సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. చికెన్ తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పడంతో మళ్లీ చికెన్ ధర పుంజుకుంది. కోళ్ల ఉత్పత్తి తగ్గిడంతో గుడ్లు పెట్టే కోళ్లను కూడా విక్రయించారు. గుడ్లు పెట్టే కోళ్ల సంఖ్య తగ్గడంతో కోడి గుడ్ల ధర అమాం తం పెరిగిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు.
కొండెక్కిన కోడి..
కోడికి రెక్కలొచ్చి కొండెక్కి కూర్చుంది. ఎవరూ ఊహించని విధంగా చికెన్ధర ఆకాశానికి నిచ్చెన వేసింది. జూలై 21 నుంచి ఆగస్టు 19 వరకు శ్రావణమాసం... ఆ వెంటనే ఆగస్టు 22 తేదీన వినాయకచవితి, 21 రోజుల పాటు పూజలు, ఆ తర్వాత గణే్షనిమజ్జనం ఇలా సుమారు రెండునెలల వరకు ముక్కకు దూరంగా ఉన్నారు. ఈ సమయంలో చికెన్ ధరలు పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి చికెన్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. కోడి కూర వండ కుండానే ఘాటెక్కిస్తోంది. నాలుగు రోజులక్రితం కిలో చికెన్ (స్కిన్లె్స) రూ.239 వరకు డిమాండ్ పలికింది. తర్వాత రెండురోజులకే తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగింది. శనివారం చికెన్ ధర 201 రూపాయలు ఉం డగా ఆదివా రం ఐదు రూ పాయలు పె రిగి రూ. 206 చేరుకుంది. ముక్క లేనిదే ముద్ద దిగని మాంసప్రియులు చికెన్ తినాలంటే జే బును తడుముకోవాల్సి వస్తోంది. పెరుగుతున్న చికెన్ ధరలతో కిలో కొనేవారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. పూజల మా సాలు వెళ్లిపోవడంతో చికెన్ వినియోగం పెరి గింది. దీంతో ధరలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి.
ఆగస్టు 21వ తేదిన కిలో చికెన్ (స్కిన్ లేకుండా) 167రూపాయలు ఉండగా 22వ తేదీన రూ. 170కి పెరిగింది. మరుసటిరోజు రూ.177కు చేరుకుంది. ఆ తర్వాత రూ.182కు చేరుకుని రెండు రోజుల పాటు ధర నిలకడగా ఉంది. మళ్లీ రూ.3 పెరిగింది. ఆగస్టు చివరి నాటికి చికెన్ ధర రూ.193కు చేరుకుంది. సెప్టెంబరు ఒకటిన రూ.198 అమ్ముడుపోగా.. ఒక్కసారిగా ధర పెరిగింది. 2వ తేదీన రూ.206కు చేరుకుంది. 3వ తేదీ రూ.223, 4వ తేదీ రూ.231కి అమ్ముడు పోయింది. మరుసటిరోజు 5వ తేదిన మరో రూ.8 పెరిగింది. ఈనెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజులపాటు చికెన్ ధర రూ.239 ధర పలికింది. ఈనెల 10వ తేదిన రూ.16 తగ్గి రూ.223కు చేరుకుంది. అలాగే ఈనెల 11వ తేదీన చికెన్ ధర తగ్గినట్టే తగ్గి మళ్లీ ఎగబాకింది. రూ.5 పెరగడంతో ప్రస్తుతం వ్యాపారులు రూ.206 నుంచి రూ.210 వరకు డిమాండ్ ఉంది. కొన్నిప్రాంతాల్లో ధరలు పెంచి రూ. 215 నుంచి రూ.220 వరకు విక్రయిస్తున్నారు.
గుడ్డు ఒక్కటి రూ. 6కు అమ్ముతున్నారు - రంగారెడ్డి, రైతు, మల్కాపూర్
కరోనా కరువు కాలంలో పేద ప్రజలు కడుపునిండా భోజనం చేయాలన్న కష్టంగా మారింది. గ్రామాల్లో రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఉంది. వారంలో ఒక్కరోజైన చికెన్, మటన్ తినలేకున్నాం.. కనీసం కోడిగుడ్డు కూర అయినా వండుకుందామంటే వాటి ధరలు కూడి మండిపోతున్నాయి. గుడ్డు ఒక్కటి రూ.6 అమ్ముతున్నారు. గుడ్ల ధరలైనా పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.