నేటి నుంచి డిజిటల్ పాఠాలు
ABN , First Publish Date - 2020-09-01T08:38:02+05:30 IST
నేటి నుంచి విద్యార్థులకు డిజిటల్ పాఠాలు బోధించనున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్ / ఆంధ్రజ్యోతి, వికారాబాద్) : నేటి నుంచి విద్యార్థులకు డిజిటల్ పాఠాలు బోధించనున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు బడికి వెళ్లకుండా ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా పాఠాలు చెప్నేందకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీశాట్, దూరదర్శన్ యాదగిరి చానల్ ద్వారా ప్రసారం అవుతాయి. 3 నుంచి 5వ తరగతులకు రోజుకు గంటన్నర, 6 నుంచి 8వతరగతి వరకు రోజుకు 2గంటలు, 9 నుంచి 10వ తరగతి వరకు రోజుకూ 3గంటల చొప్పున ప్రసారం అవుతాయి.
విద్యార్థులకు ఇచ్చిన కాలపట్టిక ప్రకారం ఈ పాఠాలు అన్నిస్థానిక కేబుల్ టీవీల ద్వారా ప్రసారం అవుతాయి. అంతేకాకుండా నెట్ సౌకర్యం ఉంటే కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ఫోన్ ద్వారా కూడా చూడటానికి అవకాశం ఉంటుంది
ఇంగ్లీషు మీడియం పాఠాలు ఎలా?
తెలుగు మీడియం విద్యార్థులకు నేటి నుంచి ఆన్లైన్లో పాఠాలు బోధించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు బోధన ఎలా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు తెలుగు మీడియం పాఠాలు వినాల్సిందేనా అని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్ జిల్లాలో టీవీలు, ల్యాప్ట్యా్పలు, ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో లేని విద్యార్థులు, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా నెట్వర్క్ సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఎంత మంది ఉన్నారనే లెక్కలు తీశారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 64,544 మంది విద్యార్థులు చదువుతుండగా, వారిలో 43,561 మందికి సెల్ఫోన్ అందుబాటులో ఉండగా, 26,732 మందికి మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉంది.
35,386 మంది విద్యార్థులకు కేబుల్ టీవీ కనెక్షన్, 219 మంది విద్యార్థులకు కంప్యూటర్, ట్యాప్టాప్, ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 4,625 మంది విద్యార్థులకు టీవీ, ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్ వంటి సదుపాయాలు లేవని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఈ విద్యార్థులకు ఆన్లైన్ చదువులు అందేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే బాధ్యతను ఉపాధ్యాయులపై ఉంచారు.