ప్రమాదకరంగా పైపులు
ABN , First Publish Date - 2020-09-17T10:09:35+05:30 IST
నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే మేడ్చల్-శామీర్పేట రోడ్డు పక్కన పైపులు ప్రమాదకరంగా మారినప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యాడు
![ప్రమాదకరంగా పైపులు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020091704344937/09172020043930n16.jpg)
మేడ్చల్-శామీర్పేట రోడ్డుపై పైపులతో ఇబ్బందులు
పట్టించుకోని అధికారులు
మేడ్చల్: నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే మేడ్చల్-శామీర్పేట రోడ్డు పక్కన పైపులు ప్రమాదకరంగా మారినప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. దీనితో వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. మేడ్చల్-శామీర్పేట రోడ్డులో కిష్టాపూర్ మలుపు వద్ద రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన భారీపైపులు దాదాపు సగం రోడ్డును ఆక్రమించుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల రోజులుగా పైపులు రోడ్డుపై ప్రమాదకరంగా పడి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలే వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రోడ్డు గుంతలమయంగా ఉంటుంది.
దీనికితోడు రోడ్డు పక్కన వృథాగా పడేసిన పైపులతో మరింత ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు ఇంత ఇబ్బందులు పడుతున్నా మున్సిపల్ అధికారులు గాని, ఆర్ అండ్ బి అధికారులు గాని ప్రమాదకరంగా మారిన పైపులను కనీసం పక్కకు జరిపే విధంగా కూడా చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. రాత్రి సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశమున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం ఎంత వరకు సమంజసమని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రమాదకరంగా మారిన పైపులను రోడ్డు పక్కకు తొలగించి పైపులను వేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.