రెండు ఇళ్లలో చోరీ
ABN , First Publish Date - 2020-12-08T05:14:38+05:30 IST
రెండు ఇళ్లలో చోరీ

రూ.లక్షా 10వేలు, అరతులం బంగారం అపహరణ
ఘట్కేసర్ రూరల్: తాళం వేసిన రెండిళ్లలో చోరీ అయిన సంఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి అన్నోజిగూడలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పోచారం మునిసిపాలిటీ, అన్నోజిగూడ సాయినగర్కు చెందిన బండారి రఘురాం ఈనెల 6న అదే కాలనీలోని తన బావమరిది పెళ్లికి కుటుంబసభ్యులతో కలిసివెళ్లాడు. ఆదివారం అక్కడే ఉండటంతో ఇదే అదనుగా భావించిన గుర్తుతెలియని దుండగులు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. కబోర్డులోని రూ.90వేల నగదును అపహరించుకెళ్లారు. రఘురాం సోమవారం ఉదయం వచ్చి చూసేసరికి తలుపులు తీసి ఉండటంతో చోరీ జరిగిందని భావించి ఇంటిలోపలికి వెళ్లి చూశాడు. సామగ్రిని చిందరవందరగా పడేసి కబోర్డులోని రూ.90 వేలనగదును అపహరించుకెళ్లారు. దీంతో రఘురాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే కాలనీలో నివాసం ఉండే రవికుమార్ గత మూడు నెలల క్రితం ఇంటికి తాళం వేసి మిర్యాలగూడకు వెళ్లాడు. గుర్తుతెలియని దుండగులు ఆదివారం రాత్రి ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అల్మారలోని రూ.20 వేల నగదుతో పాటు 5 గ్రాముల చెవికమ్మలు అపహరించుకెళ్లారు. రవికుమార్ సోదరుడు సోమవారం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్స్సెక్టర్ చంద్రబాబు, క్రైం ఇన్స్పెక్టర్ జంగయ్యలు రెండు ఇళ్లలో జరిగిన చోరీని పరిశీలించి, క్లూస్టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల ఆధారంతో దుండగులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ చంద్రబాబు తెలిపారు.