కరోనా.. కలవరం
ABN , First Publish Date - 2020-03-16T06:21:19+05:30 IST
ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వికారాబాద్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం పాఠశాలలు, సినిమా థియేటర్లు, షాపింగ్మాల్స్ను మూసి వేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా వికారాబాద్ అనంతగిరిలో కరోనా ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని ప్రచారం జరగడంతో అనంతగిరి, వికారాబాద్కు వచ్చే వారు వారి ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు.
నిర్మానుష్యంగా అనంతగిరి ఆలయ పరిసరాలు
అడవిలో కనిపించని పర్యాటకులు
మెజారిటీ ప్రజలు ఇంటికే పరిమితం
వసతిగృహాల నుంచి ఇంటిబాట పట్టిన విద్యార్థులు
వికారాబాద్: ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వికారాబాద్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం పాఠశాలలు, సినిమా థియేటర్లు, షాపింగ్మాల్స్ను మూసి వేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా వికారాబాద్ అనంతగిరిలో కరోనా ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని ప్రచారం జరగడంతో అనంతగిరి, వికారాబాద్కు వచ్చే వారు వారి ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. శని, ఆదివారాలు వస్తే చాలు జంట నగరాలతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుని ఆనందంగా అడవిలో గడిపేవారు. శనివారం ఏ విధంగా ఉందో ఆదివారం కూడా ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.
అడవిలో సైతం పర్యాటకులు లేకపోవడం విశేషం. దీనికి తోడు పాఠశాలలు మూతపడడంతో వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంటికి తీసుకెళ్లడం కన్పించింది. ప్రజలు సైతం ఆదివారం ఇంటికే పరిమితమై కన్పించారు. ఏ నోట విన్నా కరోనా చర్చే పట్టణంలో వినిపిస్తుంది. నలుగురు కలిసిన చోటా కరోనా మాటే వినిపిస్తుంది. ఇదిలా ఉంటే అనంతగిరి హరిత రిసార్ట్స్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్తో పాటు ఆదివారం టీబీ ఆసుపత్రిలోని వార్డుల్లో అధికారులు మరిన్ని బెడ్లను సిద్ధం చేశారు. ఇప్పటి వరకు కరోనాకు సంబంధించిన పేషట్లు రాలేరని తెలుస్తోంది. అవసరమైతేనే ఇక్కడి వరకు రోగులను తీసుకువస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనా కరోనా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజల్లో, బంధువుల్లో, పర్యాటకుల్లో కరోనా భయం పట్టుకుంది.