శరవేగంగా..!
ABN , First Publish Date - 2020-10-03T09:30:03+05:30 IST
కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న పుడమి బిడ్డల సేవ కోసం రైతు వేదికలు సిద్ధమవుతున్నాయి.
కొనసాగుతున్న రైతువేదికల నిర్మాణాలు
మంత్రి సబితారెడ్డి చొరవతో మహేశ్వరంలో తొలి వేదిక సిద్ధం..
రెండు మూడు రోజుల్లో పూర్తికానున్న మరో 13 రైతు వేదికలు
ఈ నెల 15 వరకు 67 నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు
నిర్మాణాలపై దృష్టి సారించిన వ్యవసాయ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న పుడమి బిడ్డల సేవ కోసం రైతు వేదికలు సిద్ధమవుతున్నాయి. పంటల సాగులో రైతులకు అవసరమైన సల హాలు, సూచనలతో వారిలో నైపుణ్యాన్ని నింపా లనే లక్ష్యంతో ప్రభుత్వం రైతు వేదికలను నిర్మి స్తోంది. వీటి నిర్మాణాలకు క్లస్టర్ల వారీగా వీటి నిర్మాణానికి అవసరమైన నిధులను ఉపాధిహామీ పథకం కింద విడుదల చేసింది. ఒక్కో రైతు వేదిక నిర్మాణం 20గుంటల్లో నిర్మిస్తున్నారు. దీనికోసం రూ.22 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఈ లెక్కన జిల్లాలో 83 రైతువేదిక నిర్మాణాలకు రూ.18.26 కోట్లు ఖర్చు పెడుతోంది. ఇప్పటికే అన్ని వ్యవసాయ క్లస్టర్లలో పనులను ప్రారంభించారు. మరికొన్నిచోట్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతువేదికల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రభుత్వ మార్గ దర్శక సూత్రాలను అనుసరించి జిల్లా వ్యవసాయశాఖ అధికా రులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు రైతు వేదికల నిర్మాణంపై దృష్టిసారించారు.
చకచకా పనులు
రంగారెడ్డి జిల్లాలో మొత్తం 83 వ్యవసాయ క్లస్టర్లలో ఈ రైతువేదికల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోనే తొలి రైతువేదిక మహేశ్వరం క్లస్టర్లో పూర్తి చేశారు. కాగా మరో 13 వేదికల నిర్మాణాలు మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానున్నాయి.
ఈనెల 15 వరకు 67 నిర్మాణాలు
మిగిలిన 67 రైతు వేదికల నిర్మాణాలను అక్టోబరు 15వ తేదీలోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్యాన్ని నిర్దేశించారు. వీటిలో 46 వేదికలు లెంటర్ లెవల్ వరకు పూర్తికాగా మరో 13వేదికలు రూఫ్ లెవల్ వరకు వచ్చాయి. 20 రైతువేదికల వరకు పెయింటింగ్, ఎలక్రిక్టల్, ఫ్లోరింగ్, శానిటరీ లాంటి తుది పనులు కావాల్సి ఉంది.
తీరనున్న కష్టాలు
రైతులను ఒకచోట చేర్చి సమావేశాలను నిర్వహించేందుకు వ్యవసాయ శాఖకు ఇప్పటివరకు సరైన వేదికలు అందు బాటులో లేవు. దీంతో చెట్లకింద, పంచాయతీ కార్యాలయ ఆవ రణంలో, ఆలయ ప్రాంగణాల్లో, కమ్యూనిటీ భవనాల్లో శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాల్సి వచ్చేది. ప్రతీసారి సమా వేశం ఎక్కడ నిర్వహిస్తున్నారనే విషయం తెలియక ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యలను అధిగమించేందుకు సీఎం కేసీఆర్ రైతువేదికల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం జిల్లాలో ఈ వేదిక నిర్మాణాలు ఊపందుకున్నాయి.