కరోనా టీకా పరిశీలనకు 80దేశాల రాయబారుల రాక

ABN , First Publish Date - 2020-12-06T05:26:19+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిని పరిశీలించేందుకు 80దేశాలకు చెందిన రాయబారులు మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట్‌ మండలం తుర్కపల్లిలోని జినోమ్‌ వ్యాలీలో గల భారత్‌ బయోటెక్‌ను సందర్శించనున్నారు.

కరోనా టీకా పరిశీలనకు 80దేశాల రాయబారుల రాక

  • ఈనెల 9న మేడ్చల్‌జిల్లాలోని జినోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ సందర్శన 
  • కోవాగ్జిన్‌ టీకాపై శాస్త్రవేత్తలతో చర్చించనున్న రాయబారులు

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిని పరిశీలించేందుకు 80దేశాలకు చెందిన రాయబారులు మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట్‌ మండలం తుర్కపల్లిలోని జినోమ్‌ వ్యాలీలో గల భారత్‌ బయోటెక్‌ను సందర్శించనున్నారు. భారత్‌ బయోటెక్‌ సంస్థ కరోనా నివారణకు కోవాగ్జిన్‌ టీకాను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈనెల 9న పలు దేశాలకు చెందిన రాయబారుల బృందం భారత్‌ బయోటెక్‌లో తయారవుతోన్న కోవాగ్జిన్‌ టీకాను పరిశీలించనున్నారు. రాయబారుల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర అధికారుల బృందం పర్యవేక్షించింది. వ్యాక్సిన్‌ తయారీ తాజా పరిస్థితితో పాటు టీకా అభివృద్ధిపై శాస్త్రవేత్తలతో చర్చించనున్న దృష్ట్యా, తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. ఇటీవల కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌పై భారత్‌ బయోటెక్‌ను ప్రధాని నరేంద్రమోదీ సందర్శించి, టీకా అభివృద్ధిపై సమీక్షించారు. అదేవిధంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు వ్యాక్సిన్‌ అభివృద్ధిపై శాస్త్రవేత్తలతో చర్చించారు. తాజాగా భారత్‌బయోటెక్‌కు 80దేశాలకు చెందిన రాయబారుల బృందం రానుంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం రాయబారుల బృందం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ పురోగతి, పలు దేశాలకు టీకా పంపిణీపై చర్చించే అవకాశం ఉంది. 

Updated Date - 2020-12-06T05:26:19+05:30 IST