కరోనాతో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2020-12-16T04:34:40+05:30 IST
కరోనాతో ఇద్దరు మృతి చెందారు. రంగా రెడ్డి జిల్లాలో ఒకరు, వికారాబాద్ జిల్లాలో మరొకరు మృతి చెందారు.
- ఉమ్మడి జిల్లాలో 390 కేసులు నమోదు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : కరోనాతో ఇద్దరు మృతి చెందారు. రంగా రెడ్డి జిల్లాలో ఒకరు, వికారాబాద్ జిల్లాలో మరొకరు మృతి చెందారు. మంగళవారం ఉమ్మడిరంగారెడ్డి జిల్లాలో 390 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 162 కేసులు నమోదు కాగా, మేడ్చల్ జిల్లాలో 217 కేసులు నమోదయ్యాయి.వికారాబాద్ జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి.
ఇబ్రహీంపట్నం డివిజన్లో..
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం డివిజన్లో మంగళవారం 10 కేంద్రాలతోపాటు రెండు మొబైల్ వాహనాల ద్వారా 306మందికి కరోనా టెస్టులు నిర్వహిం చగా 19మందికి పాజిటివ్ వచ్చింది. ఇబ్రహీంపట్నం 9, అబ్దుల్లాపూర్మెట్ 7, యాచారం 1, మాడ్గుల 1, హయత్నగర్లో ఒకరికి పాజిటివ్ అని తేలింది.
చేవెళ్ల డివిజన్లో..
చేవెళ్ల : చేవెళ్ల డివిజన్పరిధిలో 189మందికి కరోనా పరీక్షలు చేయగా ఎవరికీ పాజిటివ్ రాలేదు. మంగళవారం చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి తదితర మండలాల్లో కరోనా టెస్టులు చేశారు.
షాద్నగర్ డివిజన్లో..
షాద్నగర్: షాద్నగర్ డివిజన్లో మంగళవారం 295 మందికి కరోనా యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యా ధికారులు తెలిపారు. వారిలో షాద్నగర్ పట్టణానికి చెందిన ఇద్దరు, నందిగామ మండలానికి చెందిన ఒకరు ఉన్నారు.
వికారాబాద్ జిల్లాలో..
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్) : వికారాబాద్ జిల్లాలో ప్రతిరోజూ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మంగళవారం కొడంగల్లో 5, తాండూరులో 3, కులకచర్ల, దోమ, వికారాబాద్లో ఒక్కో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 3,033 కరోనా కేసులు నమోదు కాగా, వాటిలో 135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో ఆరు గురు ఆసుపత్రుల్లో, 129 మంది హోం కేర్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇంతవరకు జిల్లాలో కరోనా నుంచి 2,841 మంది కోలుకోగా, 57మంది మృతి చెందారు. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు జిల్లాలో 70,481 ర్యాపిడ్ యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా, వారిలో 3,033 మందికి పాజిటివ్ రాగా, 66,588 మందికి నెగెటివ్ వచ్చింది.
కులకచర్లలో ఒకరికి కరోనా..
కులకచర్ల: కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 24 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహించగా మక్తవెంకటాపూర్కు చెందిన వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు వెల్లడైంది. రెండు రోజులుగా గ్రామంలో ఇది రెండో కేసు.
మేడ్చల్లో..
మేడ్చల్ : మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం 26 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యురాలు మంజుల తెలిపారు. శ్రీరంగవరం పీహెచ్సీలో 37మందికి పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్ రాలేదని వైద్యురాలు నళిని తెలిపారు.