నిర్మానుష్యం....
ABN , First Publish Date - 2020-04-01T11:26:44+05:30 IST
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతుంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు

పకడ్బందీగా లాక్డౌన్
కూరగాయల మార్కెట్ను ప్రారంభించి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతుంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. ఎక్కడికక్కడే చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. మంగళవారం ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. ఉదయం వేళలో పాలు, పండ్లు, కూరగాయల కోసం ఇంటికొకరు చొప్పున బయటకు వెళ్తున్నారు.
వ్యవసాయ మార్కెట్లో కొన్ని చోట్ల సామాజిక దూరం పాటిస్తుండగా మరి కొన్ని ప్రాంతాల్లో దూరాన్ని పాటించడం లేరు. వ్యాపారులు కూరగాయల ధరలను పెంచి అమ్ముతున్నారు. నిత్యం బీజీగా ఉండే శంషాబాద్ ఎయిర్పోర్టు లాక్డౌన్తో ప్రయాణికులు లేక వెలవెలబోతుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సరూర్నగర్ విక్టోరియా మెమోరియల్ హోంలోని మైదానంలో కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేశారు. సరూర్నగర్ రైతు బజార్ను తాత్కాలికంగా నిలిపివేశారు. విక్టోరియా మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను మంత్రి సబితారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్రెడ్డి ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలో వలస కార్మికులకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పంపిణీ చేశారు.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని 7వ వార్డులో వలస కార్మికులకు ఎమ్మెల్సీ పి.మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తాడికొండ స్వప్న 12 కిలోల బియ్యం, రూ.500 నగదును అందజేశారు. కొడంగల్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ పనులు చేస్తున్న 16 మంది వలస కార్మికులకు కౌన్సిలర్ మధుసూధన్ యాదవ్ బియ్యం, నగదు పంపిణీ చేశారు.