ఎరువుల సరఫరాకు అన్ని చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-11T05:04:40+05:30 IST
వచ్చే యాసంగి సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు.
![ఎరువుల సరఫరాకు అన్ని చర్యలు తీసుకోవాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/2020121011324170/12102020233344n3.jpg)
నిజామాబాద్ అర్బన్, డిసెంబరు 10: వచ్చే యాసంగి సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్, ఇతర అధికారులతో యాసంగి సీజన్ 2020-21పై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సారి వర్షాలు బాగా పడినందున సొసైటీ చైర్మన్లు, ఫర్టిలైజర్ డీలర్లు, ట్రేడర్స్, కంపెనీ రిప్రజెంటేటివ్లతో యాసంగి సీజన్కు సుమారు 5 లక్షల 13 వేల ఎకరాల్లో పంటలు సాగుచేసేందుకు ప్రణాళికలు పెట్టుకున్నామన్నారు. అందుకు లక్షా 10 వేల 582 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుతం 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉందన్నారు. 309 డీలర్స్ నెట్వర్క్ ఉందని యూరియాను అక్రమ రవాణా, కృత్రిమ కొరత చేయాలనిచూస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. రైతులకు పాస్ మిషిన్లో యూరియా అమ్మకాలు చేయాలని, రైతులు తమ సెల్ఫోన్లో, మీసేవ, ఆధార్ సెంటర్లలో ఫోన్ నెంబర్ ఆధార్కు లింక్ చేయాలన్నారు. జిల్లాకు అవసరమైనా ఎరువులను కమిషనర్కు తెలియజేయాలని ఆ విధంగా సరఫరా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో డీఏవో గోవింద్, మార్క్ఫెడ్ డీఎం రంజిత్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.