ఆడపిల్లకు అండగా.. బాలిక భవితకు కేంద్రం భరోసా

ABN , First Publish Date - 2020-12-11T04:59:14+05:30 IST

బాలిక భవితకు భరోసానిచ్చే సుకన్య సమృద్ధియోజన పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేసేందుకు తపాలా, సంక్షేమశాఖలు సిద్ధమవుతున్నాయి.

ఆడపిల్లకు అండగా.. బాలిక భవితకు కేంద్రం భరోసా

మరింత విస్తృతంగా సుకన్య సమృద్ధి యోజన
అంగన్‌వాడీల భాగస్వామ్యంతో అమలుకు శ్రీకారం
తపాలా, మహిళా శిశుసంక్షేమశాఖలకు బాధ్యతల అప్పగింత


కామారెడ్డి, డిసెంబరు 10:
బాలిక భవితకు భరోసానిచ్చే సుకన్య సమృద్ధియోజన పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేసేందుకు తపాలా, సంక్షేమశాఖలు సిద్ధమవుతున్నాయి. పదేళ్లలోపు వయసున్న ప్రతీ ఆడపిల్లకు ఈ ఖాతాను అందించడమే లక్ష్యంగా ఇరుశాఖలు సంయుక్త కార్యాచరణను అమలు చేయనున్నాయి. ఆడపిల్లల భవితకు అండగా నిలిచేందుకు 2015లో కేంద్రప్రభుత్వం తపాలాశాఖ ద్వారా సుకన్య పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఆడపిల్లల సంరక్షణకు చిన్నమొత్తం పొదుపులో కీలకమైన ఈ పథకంపై తల్లిదండ్రులకు ఆశించిన స్థాయిలో అవగాహన కల్పించలేదు. పోస్టల్‌శాఖలో సిబ్బందిపై ఉన్న పని భారంతో కొందరికే ఈ ఫలాలు అందాయి. మరింత మందికి అవగాహన కలిపించి చేరువ చేసేందుకు రెండు శాఖల ఆధ్వర్యంలో ఖాతాలు ఎక్కువగా తె రిపించేందుకు కృషి చేయనున్నారు.
సుకన్య ఖాతాలు ఎక్కువగా తెరిచేందుకు సన్నద్ధం
జిల్లా వ్యాప్తంగా కేవలం 20వేలలోపు మంది బాలికల పేరిట మాత్రమే సుకన్య ఖాతాలు ఉన్నట్లు సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులకు విస్తృతస్థాయిలో ఈ పథకాన్ని చేరువ చేయాలని కేంద్రం భావిస్తోంది. చిన్నారులు, మహిళలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉండే మహిళ, శిశు సంక్షేమశాఖను ఇందులో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. సుకన్య ఖాతాలను తెరువడంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈ పథకానికి అర్హులైన వారందరిని గుర్తించే పనిలో ఆయా శాఖలు నిమగ్నమయ్యాయి.


ప్రాజెక్ట్‌కు మూడు వేల చొప్పున
ప్రతీ ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ స్కీం(ఐసీడీఎస్‌) పరిధిలో కనీసం మూడు వేల సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను తెరిపించాలని తపాలాశాఖ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. జిల్లాలో 5 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉండగా 15వేల ఖాతాలు తెరిచేలా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని ప్రధాన, మినీ అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని బాలికల వివరాలు సేకరిస్తున్నారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన గర్భిణుల వివరాలు కూడా తీసుకుంటున్నారు. వీరిలో పదేళ్లలోపు బాలికలున్న తల్లిదండ్రులు సుకన్యయోజన ఖాతా తెరిచారా.. లేదా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఖాతాలేని వారికి సుకన్య పథకం ప్రాధాన్యత, ఆవశ్యకతపై చైతన్యం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. తల్లిదండ్రులను మెప్పించి ఖాతా తెరిచేలా చూస్తారు. ఐదేళ్లలోపు బాలికల వివరాలు అంగన్‌వాడీ కేంద్రాల్లో మాత్రమే లభిస్తాయి. 6 నుంచి పదేళ్ల వయస్సు లోపు ఆడపిల్లల వివరాలను ప్రాథమిక పాఠశాలల నుంచి తీసుకుంటారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఏడాది నుంచి ఐదేళ్లలోపు బాలికలు సుమారు 2 లక్షల వరకు ఉంటారని అంచనా.


కనీస రుసుం రూ.250
సుకన్య యోజన అమల్లోకి వచ్చిన కొత్తలో ఆడబిడ్డల పేరుపై ఖాతా తెరవడానికి కనీస రుసుం రూ.వెయ్యి ఉండేది. అయితే ఎక్కువ మంది బాలికలకు మేలు చేకూర్చాలనే ఉద్దేశ్యంతో పాటు పేద, అల్పాదాయ కుటుంబాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.250 కుదించింది. అప్పుడే పుట్టిన ఆడశిశువు మొదలుకొని పదేళ్ల వయసున్న బాలికలందరి పేరున ఖాతాలో తెరువవచ్చు.

Updated Date - 2020-12-11T04:59:14+05:30 IST