న్యావనంది హత్య కేసు దర్యాప్తు ముమ్మరం

ABN , First Publish Date - 2020-12-19T05:41:05+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యావనంది కేసులో పోలీసులు సాంకేతికతపైననే దృష్టి పెట్టారు. ఆ కోణంలోనే దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

న్యావనంది హత్య కేసు దర్యాప్తు ముమ్మరం

త్వరగా తేల్చేందుకు సాంకేతికత వినియోగం
క్లూస్‌ టీం, మొబైల్‌ ఫోన్‌, నేరం జరిగిన తీరుపై దృష్టి
ఒకేసారి నిందితులను అదుపులోకి తీసుకునేందుకు యత్నం

నిజామాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యావనంది కేసులో పోలీసులు సాంకేతికతపైననే దృష్టి పెట్టారు. ఆ కోణంలోనే దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కొత్త అంశాలపైన దృష్టి సారించి కేసును తేల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌ ఆధ్వర్యంలో గ్రామస్థులను మళ్లీ విచారించారు. వారు చెప్పే అంశాలపైన కూలంకశంగా పరిశీలిస్తున్నారు. మహిళ కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలోని పలువురిని విచారించిన అధికారులు టెక్నికల్‌ అంశాల ఆధారంగానే కేసును తేల్చేందుకు సిద్ధమవుతున్నారు.  క్లూస్‌ టీమ్‌, ఇంతకు ముందు చేసిన దర్యాప్తును అనలైజ్‌ చేస్తూ ముందుకుపోతున్నారు. గ్రామస్థులు అనుమానించిన వ్యక్తులను కూడా విచారించారు. వారి నుంచి వివరాలను సేకరించారు. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం న్యావనందిలో అక్టోబరు 3వ తేదీన మధ్యాహ్నం మమత అనే వివాహిత హత్యకు గురయింది. పట్టపగలు  పంటచేనులోనే హత్యకు గురికావడం.. గ్రామస్థులు ధర్నాలు నిర్వహించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హత్య జరిగిన తర్వాత క్లూస్‌ టీమ్‌ను తీసుకవచ్చి స్థానిక పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో పలువురిని విచారించారు. వివరాలను సేకరించారు. గ్రామస్థులు ఆందోళనలు నిర్వహించడం బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కేసును త్వరగా తేల్చాలని డిమాండ్‌ చేశారు. పోలీసు లపైన  ఒత్తిడి పెంచారు.  చివరకు వేరే అధికారులను పెట్టి దర్యాప్తు చేపట్టినా ఫలితం మా త్రం రాలేదు. గ్రామస్థులు తమ ధర్నాలను ఆపలేదు. చివరకు గ్రామానికి చెందిన గంగాధర్‌ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే కేసులో విచారించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు మూడు రోజుల పాటు ధర్నాలు నిర్వహించారు. మృతదేహాన్ని చెట్టు నుంచి కిందకు దించగా ధర్నా చేయడంతో  అధికారుల జోక్యంతో పోస్టుమార్టంకు పంపించి అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కేసు రోజులు గడుస్తున్నా తేలకపోవడంతో  ఐ.జి. శివశంకర్‌రెడ్డి, అదనపు డీజీపీ ఉషావిశ్వనాథ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సిరికొండతో పాటు న్యావనంది గ్రామంలో గ్రామస్థులను రప్పి ంచి విచారణ  చేపట్టారు. వారి నుంచి వివరాలను సేకరించారు. గ్రామస్థులు మమత చనిపోయిన సమయంలో అనుమానించిన వ్యక్తిని సైతం రెండు రోజుల పాటు విచారించారు. వివరాలను సేకరించారు. కేసు ఇంకా కొలిక్కి రాకపోవడంతో సాంకేతికతపైన దృష్టి పెట్టారు. హత్య జరిగిన విధానం, ఆ సమయంలో పనిచేసిన మొబైళ్ల వివరాల ఆధారంగా కేసును పరిశోధిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికను ఆధారంగా తీసుకున్నారు. హత్య సమయంలో  గొంతుకోసి ఉండడంతో ఆ తీరును కూడా పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన సమ యంలో మొబైల్‌ఫోన్‌లు ఆ ప్రాంతంలో ఎన్ని ఆన్‌లో ఉన్నాయి, ఎవరెవరు మాట్లాడారు, వాటిని కూడా విశ్లేషిస్తున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో క్లూస్‌ టీమ్‌కు దొరికిన ఆధారాలు, జాగిలాలు వెళ్లిన ప్రాంతాలు, గ్రామస్థులు చెప్పిన వివరాలు ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఈ కేసు  మొదటి నుంచి  కొలిక్కి రాకపోవడం పోలీసులకే సవాల్‌గా నిలవడంతో అన్ని ఆధారాలతో నిందితులను పట్టుకునేందు కు ఎక్కువగా టెక్నికల్‌ అంశాలను పరిశీలిస్తూ పకడ్బందీగా విచారణ కొనసాగిస్తున్నారు. త్వరగా నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే  కేసు లో విచారణ ఎదుర్కొన్న గంగాధర్‌  మృతి చెందడంతో రాజకీయ పార్టీలతో పాటు ప్రజల నుంచి ఆరోపణలు వస్తుండడంతో పోలీసులు ఈ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అన్ని విశ్లేషిస్తూ ముందుకు పోతున్నారు. కొద్ది రోజుల్లోనే దర్యాప్తును పూర్తి చేయడంతో పాటు అసలైన వారిని పట్టుకుంటామని సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. అప్పటి వరకు వివరాలు వెల్లడించలేమని ఒకేసారి పట్టుకోవడంతో పాటు కేసును క్లోజ్‌ చేస్తామన్నారు. మరోసారి ఇలా ంటి ఆరోపణలకు తావివ్వకుండా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  సాంకేతిక అంశాల ఆధారంగా ఈ  కేసును తేల్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ ఆరోపణలు పెరగకముందే దర్యాప్తును పూర్తిచేసే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. కుటుంబసభ్యులు, గ్రామస్థులు మాత్రం విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2020-12-19T05:41:05+05:30 IST