కాసుల కిలాడీ
ABN , First Publish Date - 2020-11-26T05:46:20+05:30 IST
క్రికెట్ బెట్టింగ్ కొందరు పోలీసు అధికారులకు కాసుల పంటనే పండించింది. సీఐ జగదీష్ లాకర్ తెరుచుకోవడంతో బయటపడ్డ నోట్లకట్టలే నిదర్శనం. ఏసీబీ అధికారులు లోతైన విచారణ జరపడంతో సీఐ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

సీఐ జగదీష్ లాకర్ నుంచి భారీగా నగదు స్వాధీనం
సీఐ భార్యతో లాకర్ ఓపెన్ చేయించిన ఏసీబీ
నోట్లకట్టలు బయటపడడంతో అవాక్కయిన అధికారులు
సీఐ జగదీష్ మూలాలు నిజామాబాద్ నుంచే..
కామారెడ్డిలో ఓ మర్డర్ కేసులో, ఓ పెళ్లి సంబంధం విషయంలో భారీగా ముడుపులు
సీఐ లాకర్లో భారీగా డబ్బు, విలువైన పత్రాల స్వాధీనం
రూ.34,40,200, 182.560 గ్రాముల బంగారు నగలు, 15.7 గ్రాముల వెండి స్వాధీనం
విలువైన ప్రాపర్టీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు
కామారెడ్డి(ఆంధ్రజ్యోతి)/కామారెడ్డి, నవంబరు 25: క్రికెట్ బెట్టింగ్ కొందరు పోలీసు అధికారులకు కాసుల పంటనే పండించింది. సీఐ జగదీష్ లాకర్ తెరుచుకోవడంతో బయటపడ్డ నోట్లకట్టలే నిదర్శనం. ఏసీబీ అధికారులు లోతైన విచారణ జరపడంతో సీఐ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ బ్యాంక్లోని లాకర్లో భద్రపరిచిన భారీ సొత్తును, ఆభరణాలను విలువై న డాక్యుమెంట్లను ఏసీబీ అధికారు లు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఒక సీఐ లక్షల రూపాయలను అక్రమ ంగా సంపాదించడంపై ఏసీబీ అధికారులు గుట్టుర ట్టు చేశారు. సదరు సీఐ అవినీతి అక్రమాలు నిజామాబాద్ నుంచి కొనసాగినట్లు తెలుస్తోంది. కామారెడ్డిలో క్రికెట్ బెట్టింగ్ విషయం లోనే కాకుండా కొన్ని కేసుల విషయంలోనూ భారీగానే వసూలు చేసినట్లు బాధితులు ‘ఆంధ్రజ్యోతి’తో గోడు వెల్లబోసుకున్నారు.
తెరుచుకున్న సీఐ లాకర్.. పెద్ద మొత్తంలో బయటపడ్డ నగదు
ఐపీఎల్ బెట్టింగ్ నిర్వా హకుల నుంచి డబ్బులు డిమాండ్ చేశాడనే ఆరోపణలపై ఏసీబీ అధికా రులు కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్ను కామారెడ్డిలోని అతని ఇంట్లో విచారించిన విషయం విధితమే. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు రావడంతో సీఐ జగదీష్పై విచారణ జరిపారు. ఐపీఎల్ బెట్టింగ్లో నిర్వాహకుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు రుజువుకావడంతో అతనిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గతంలో సైతం అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం మేర కు రెండు రోజుల పాటు సీఐ జగదీష్ను ఏసీబీ అధికారులు కామారెడ్డిలో విచారించారు. ఆయన ఆస్తులకు సంబంధించి లాకర్ను బుధవారం నిజామా బాద్లోని కంఠేశ్వర్లో గల యాక్సిస్బ్యాంక్ లాకర్ను ఏసీబీ అధికారులు తెరువ గా అందులో రూ.34లక్షల 40వేల 200ల నగదు, రూ.9లక్షల 12వేల 800 విలువ గల 182.560 గ్రాముల బంగారు నగలు, రూ.1020 విలువగల 15.7 గ్రాముల వెండి నగలతో పాటు విలువైన ఆస్తి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జనరల్ అధికారులు తెలిపారు. కామారెడ్డి పట్టణంలో సీఐగా విధులు నిర్వర్తించిన జగదీష్ ఐపీఎల్ బెట్టింగ్ నిర్వాహకుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు వారు ఫిర్యాదు చేయడంతో అతనిని విచారించిన ఏసీబీ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు అతనిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఆయనతో పాటు ఐపీఎల్ బెట్టింగ్ మధ్యవర్తిగా ఉన్న సుజయ్ను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐ జగదీష్ ఆస్తుల వివరాలను తెలసుకునేందుకు ఆయన ఉపయోగించిన లాకర్ను బుధవారం నిజామాబాద్లోని కంఠేశ్వర్ యాక్సిస్ బ్యాంక్ శాఖలో తెరిచారు. ఏసీబీ అధికా రులు భావించినట్లుగానే నగదుతో పాటు బంగారు, వెండి నగలు, పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
సీఐ అక్రమాల మూలాలు నిజామాబాద్ నుంచే..
కామారెడ్డి పట్టణ సీఐగా విధులు నిర్వహించిన ఇందూర్ జగదీష్ ఇటీవల క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు డిమాండ్ చేశాడనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. అయితే క్రికెట్ బెట్టింగ్ విషయంలో సీఐ అక్రమాలకు పాల్పడడం బీజం వేసింది నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచేనని ఏసీబీ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. అయితే నిజామాబాద్ జిల్లాలో టాస్క్ఫోర్స్లో పని చేసిన సమయంలో జగదీష్ గత ఏడాదిన్నర కిందట ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న కొంతమందిని అదుపు లోకి తీసుకున్నాడు. ఈ వ్యవహారంలో నిర్వాహకులపై కేసుల విషయంలో కొన్ని బేరాసారాలు కుదుర్చుకుని మామూళ్లు తీసుకున్నాడనే ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి. ఇదే తరహాలో కామారెడ్డి పట్టణానికి సీఐగా బదిలీ అయిన తర్వాత ఇటీవల బెట్టింగ్ వ్యవహారంలో జగదీష్ అక్రమాలపై కొందరు ఏసీబీని ఆశ్రయిం చడంతో వెలుగులోకి వచ్చింది. ఇలా సీఐ జగదీష్ ఎస్ఐ నుంచి పలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీస్శాఖ ఉన్నతాధికారులతో పాటు నిఘా విభాగాలకు ఫిర్యాదు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఓ మర్డర్ కేసు.. పెళ్లి సంబంధం విషయంలోనూ భారీగా వసూళ్లు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలోనే కాకుండా కొన్ని కేసుల విషయంలోనూ సీఐ జగదీష్ అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు వస్తు న్నాయి. ఆ కేసుల విషయంలో బాధితుల నుంచి లక్షల్లోనే వసూళ్లు చేసినట్లు కొందరు ‘ఆంధ్రజ్యోతి’తో తమ ఆవేదనను చెప్పుకొచ్చారు. కామారెడ్డి పట్టణంలో ఇటీవల ఓ వివాహిత హత్యకు గురికాగా ఆ కేసు విషయంలో భర్తకు సీఐ అనుకూలంగా వ్యవహరించి వివాహిత హత్యను కాస్తా ప్రమాదవశాత్తు మృతిగా కేసు మార్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు విషయ ంలోనే సీఐ రూ. లక్షల్లో ముడుపులు తీసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఓ పెళ్లి సంబంధం విషయంలోనూ అబ్బాయికి సపోర్టు చేసి అమ్మాయి కుటుంబానికి అన్యాయం చేశాడని సీఐపై ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి మరో వారం రోజుల్లో ఉందనగా అబ్బాయి సదరు అమ్మాయిని చేసు కోనని చెప్పడంతో బాధిత అమ్మాయి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్ర యించారు. ఈ కేసు విషయంలో అబ్బాయి తరఫున ఓ మధ్యవర్తిని నియ మించుకుని సీఐ డబ్బులు వసూలు చేసి తమకు అన్యాయం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలా జగదీష్ జగమంతా అక్రమాలు చేశాడని సొంత పోలీస్శాఖ నుంచే కాకుండా బాధితుల నుంచే నేరుగా ఆరోపణలు వస్తుండడం ఉమ్మడి జిల్లాలో సంచలనంగా మారింది.