కామారెడ్డి జిల్లాకు ప్రఖ్యాత డిజిటల్ ఇండియా అవార్డు!
ABN , First Publish Date - 2020-12-30T22:58:10+05:30 IST
పరిపాలనలో డిజిటలీకరణ ప్రవేశపెట్టేందుకు కామారెడ్డి జిల్లా యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలకు తాజాగా దేశవ్యాప్తం గుర్తింపు లభించింది.
కామారెడ్డి: పరిపాలనలో డిజిటలీకరణ ప్రవేశపెట్టేందుకు కామారెడ్డి జిల్లా యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలకు తాజాగా దేశవ్యాప్త గుర్తింపు లభించింది. ప్రఖ్యాత డిజిటల్ ఇండియా అవార్డును కామారెడ్డి కైవసం చేసుకుంది. డిజిటల్ గవర్నన్స్ విభాగంలో అద్భుత పనితీరు కనబర్చి దేశంలోని కామారెడ్డి జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ స్వయంగా ఈ వార్డును ప్రదానం చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా..తమ హక్కుల్ని సాధించుకోవాలన్న ప్రజలకు కావాల్సింది సమాచారమే. డిజిటిలీకరణ ద్వారా ప్రభుత్వానికి సంబంధించి సమాచారమంతా సులువుగా ప్రజల ముందుకు తేవచ్చు. అంతేకాకుండా.. డిజిటల్ విధానాల ద్వారా ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత సాధించవచ్చు. ఈ స్ఫూర్తితోనే జిల్లా కలెక్టర్ డా. ఏ శరత్ ముందుకు కదిలారు. ఆయన సారథ్యంలో జిల్లా యంత్రాంగం.. పరిపాలనకు సంబంధించి ప్రతి పార్శంలోనూ డిజిటలీకరణను ప్రవేశపెట్టింది.
ఆన్లైన్లో పెన్షన్ల జారీ, జిల్లా స్థాయిలో ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించి పరిహారాన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించడం వంటి విధానాల్ని అధికారులు ప్రవేశపెట్టారు. ఇసుకు కోసం బుకింగులు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారంమంతా ఆన్లైన్లో లభించేలా పటిష్ట చర్యలకు పూనుకున్నారు. ఈ చర్యల కారణంగా కామారెడ్డి జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
ఈ మహత్కార్యంలో జిల్లా కలెక్టర్ డా. ఏ శరత్ జిల్లా అధికారులను ముందుండి నడిపించారు. జిల్లా యంత్రాంగం కృషి ఫలితంగా..నేడు కామారెడ్డి దేశమొత్తంలోనే డిజిటలీకరణలో ప్రథమస్థానంలో నిలిచింది. డిసెంబర్ 30న ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో..జిల్లా కలెక్టర్ ఏ.శరత్ భారత రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ చేతుల మీదుగా వెబ్రత్న అవార్డును స్వీకరించారు.
