అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి.. విప్ గంప గోవర్ధన్ వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-12-30T05:15:17+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వంపై, టీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాల ను తిప్పికొట్టాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు.
కామారెడ్డి, డిసెంబరు 29: రాష్ట్ర ప్రభుత్వంపై, టీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వెల్మ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సోషల్ మీడియా అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను అడ్డుకునే ప్రయత్నం చేసి వాస్తవాలను వివరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చేస్తున్న కృషిని గ్రామీణస్థాయి వరకు చేరేలా చూస్తూ తమ రాజకీయ లబ్ధి కోసం ఇతర పార్టీలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్షిండే, సురేందర్, మున్సిపల్ చైర్ప ర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర ఇన్చార్జ్ క్రిషంక్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముజిబోద్దిన్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.