అధునాతన సాగుతో ఆర్థికాభివృద్ధి

ABN , First Publish Date - 2020-12-31T04:47:12+05:30 IST

అధునాతన సాగు విధానంతో పెట్టుబడి ఖ ర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి రైతు లకు సూచించారు.

అధునాతన సాగుతో ఆర్థికాభివృద్ధి
కిసాన్‌ మేళాలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

 యాంత్రికీకరణ సాగుపై దృష్టి సారించాలి

 కలెక్టర్‌ నారాయణరెడ్డి

రుద్రూరు, డిసెంబరు 30: అధునాతన సాగు విధానంతో పెట్టుబడి ఖ ర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి రైతు లకు సూచించారు. రుద్రూరు చెరుకు, వరి పరిశోధనా కేంద్రంలో బుధవారం జిల్లా స్థాయి కిసాన్‌ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం అందించే పథకాలు, బ్యాంకులు ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం కూలీల కొరత తీవ్రంగా ఉందన్నారు. యాంత్రీకరణ సాగుపై ఇప్పటి నుంచి రైతులు దృష్టి సారించాలన్నారు. కలెక్టర్‌ వరి నాటే యాంత్రాన్ని నడిపి నాట్లు వేశారు. రైతులకు వరి నారుమళ్లు వేసే విధానం, చెరుకు నారుమళ్లు వేసే విధానం తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. రైతులు సాగులో తలెత్తుతున్న సమస్యలను కలెక్టర్‌, శాస్త్రవేత్తల దృష్టికి తీసుకువచ్చారు. వన్యప్రాణుల నుంచి పంటలను ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించారు. వ్యవసాయ, గ్రామీణ సాంకేతిక మేళా-స్వయం సహాయకబృందాల ప్రదర్శన, అమ్మకం నిర్వహించారు. వన్యప్రాణుల నుంచి పంటలను రక్షణ కోసం ఓ పరికరాన్ని ప్రదర్శించారు. ఆ పరికరం ద్వారా 18 రకాల శబ్దాలు విడుదల అవుతాయి. దీనిని సెల్‌ఫోన్‌ ద్వారా ఎక్కడ నుంచైనా ఆపరేటింగ్‌ చేయవచ్చు. ఈ పరికరం విద్యుత్‌, సోలార్‌ ద్వారా పని చేస్తుందని ప్రొఫెసర్‌ వాసుదేవరరావు రైతులకు పూర్తిగా వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌, పరిశోధన కేంద్ర అధిపతి శ్రీధర్‌, అసోసియేట్‌ డీన్‌ స్వామి, బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌, తహసీల్దార్‌ ముజీబ్‌ ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. 

డబుల్‌ బెడ్‌రూంలకు అదిక ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్‌  అర్బన్‌: డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తహసీల్దార్లు సమస్యలు రాకుండా చూడాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం ప్రగతిభవన్‌లో తహసీల్దార్లు, ఆర్‌అండ్‌బీ ఏఈలతో డబుల్‌ బెడ్‌రూంల ఇళ్లు, ధరణిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ధరణిపై సమస్యలు పరిష్కరించడానికి అధికారులు శ్రద్ధ చూపాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఆర్‌వో రవికుమార్‌, బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌, ఆర్‌అండ్‌బీ ఏఈ రాజేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. 

మోస్రాలో కలెక్టర్‌ తనిఖీ

వర్ని(మోస్రా): మోస్రా తహసీల్‌ కార్యాలయానికి గ్రామాభివృద్ధి కమిటీ కేటాయించిన క్యాంపస్‌ పనులను బుధవారం కలెక్టర్‌ నారాయణరెడ్డి తనిఖీ చేశారు. అదనపు సమావేశాల కోసం వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ కోసం రూ.ఐదు లక్షలు మంజూరు చేయాలని జడ్పీటీసీ గుత్ప భాస్కర్‌ రెడ్డి కలెక్టర్‌ను కోరారు. తహసీల్‌ కార్యాలయంలో అవసరమైన వసతుల కల్పనకు చర్యలు చేపడతామని ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణరెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్‌, తహసీల్దార్‌ రాజు, ఆర్‌ఐ మహేష్‌, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T04:47:12+05:30 IST