డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-12-30T04:47:16+05:30 IST

నగరంలో కొత్తగా నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంతో పాటు మైనారిటీ పాఠశాల, కొత్త కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్‌
డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

 నిజామాబాద్‌  అర్బన్‌, డిసెంబరు 29: నగరంలో కొత్తగా నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంతో పాటు మైనారిటీ పాఠశాల, కొత్త కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. నాగారంలో కొత్తగా నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లతో పాటు మైనారిటీ పాఠశాల, కొత్త కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు, పక్కనే నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పనులను పరిశీలించారు. మే చివరి కల్లా పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నారు. కొత్త కలెక్టరేట్‌ పనులను వేగవంతం చేయాలని, 15 రోజుల్లో ఫర్నీచర్‌ తెప్పించి ఆ ఏర్పాట్లు పూర్తయ్యేలా చూడాలన్నారు. మైనారిటీ పాఠశాల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నాగారం వద్ద గల ఆర్టీవో కార్యాలయం పక్క గల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. జిల్లాలో, నగరంలో ప్రభుత్వ భూమి ఎక్కడ ఉన్నా ఆ వివరాలను సర్వే చేసి తనకు అందించాలని ఆర్డీవోను ఆదేశించారు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ రాజేశ్వర్‌రెడ్డి, ఆర్డీవో రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T04:47:16+05:30 IST