‘రిలయన్స్’ ఎదుట ఏఐకేఎంఎస్ ధర్నా
ABN , First Publish Date - 2020-12-14T05:28:03+05:30 IST
కార్పొరేట్ సంస్థలైన రిలయన్స్ అంబాని, అదాని లాంటి గుత్త పెట్టుబడిదారుల వస్తువులను బహిష్కరించాలని కోరుతూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని రిలయన్స్ మార్ట్ ముందు ధర్నా నిర్వహించారు.

నిజామాబాద్ అర్బన్, డిసెంబరు 13: కార్పొరేట్ సంస్థలైన రిలయన్స్ అంబాని, అదాని లాంటి గుత్త పెట్టుబడిదారుల వస్తువులను బహిష్కరించాలని కోరుతూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని రిలయన్స్ మార్ట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దేశ సంపదనంతా దోచి కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ చట్టాన్ని రద్దుచేయాలని 17 రోజులుగా ఢిల్లీలో రైతులు శాంతియుతంగా ఉద్యమిస్తుంటే వారిపై కేంద్రం దాడులు చేయించడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ ప్రణాళికలో రైతాంగానికి పెద్దపీట వేస్తూ రైతులను లక్షాధికారులను చేస్తామని చెప్పారన్నారు. వెంటనే రైతులకు వ్యతిరేకమైన మూడు వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్తు సవరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో బీజేపీ మద్దతు ఇస్తున్న కార్పొరేట్ సంస్థల వస్తు బహిష్కరణ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాధర్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న, నాయకులు వెంకన్న, మల్లేష్, సాయాగౌడ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.